కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ను బద్నామ్ చేసే దురుద్దేశంతో మేడిగడ్డ బ్యారేజీకి సకాలంలో మరమ్మతులు చేయకపోగా, బ్యారేజీలోని 92లక్షల క్యూబిక్ మీటర్ టన్నుల ఇసును తరలించేందుకు టెండర్లు పిలువడాన్ని బీఆరెస్ తీవ్రంగా నిరసిస్తుందని పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు
విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ను బద్నామ్ చేసే దురుద్దేశంతో మేడిగడ్డ బ్యారేజీకి సకాలంలో మరమ్మతులు చేయకపోగా, బ్యారేజీలోని 92లక్షల క్యూబిక్ మీటర్ టన్నుల ఇసును తరలించేందుకు టెండర్లు పిలువడాన్ని బీఆరెస్ తీవ్రంగా నిరసిస్తుందని పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల జేబులు నింపడానికే ప్రభుత్వం ఇసుక తరలింపు నిర్ణయం తీసుకుందని, రేవంత్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పున సమీక్షించాలని డిమాండ్ చేశారు. ఈ టెండర్ గ్రీన్ ట్రిబ్యునల్ అదేశాలకు విరుద్ధంగా ఉందని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే మేము కోర్టులను ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామని సుమన్ తెలిపారు. బ్యారేజీకి మరమ్మతులు జరిపించి రైతులకు నీళ్లిచ్చే లక్ష్యం లేదుగాని ఇసుక దొబ్బి పోయే ప్రణాళికను కాంగ్రెస్ నేతలు అమలు చేస్తున్నారని విమర్శించారు. ఆరు నెలల్లోనే కాంగ్రెస్ నేతలు ఇసుక సహా అన్ని దందాల్లో కూరుకుపోయారని ఆరోపించారు. కేంద్రం బొగ్గు గనుల వేలం వేయాలని రాష్ట్రానికి డెడ్లైన్ విధించడంపై అనుమానాలున్నాయని, సింగరేణి పరిరక్షణకు సింగరేణి పరిధిలోని బొగ్గు గనులు సింగరేణికే ఉంచాలని బీఆరెస్ డిమాండ్ చేస్తుందన్నారు. బీజేపీ-కాంగ్రెస్లు ఒక్కటై సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటు పరం చేసే కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ నెల 21న దేశంలోని 52బొగ్గు గనుల వేలంలో సింగరేణి బ్లాకులున్నాయన్న అనుమానం ఉందన్నారు. అదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీకి సున్నపు రాయి గనులు, బయ్యారం స్టీల్ ప్లాంట్కు ఇనుప ఖనిజం కేటాయించేలా కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష విషయంలోనూ బీజేపీ-కాంగ్రెస్లు కుమ్మక్కయినట్లుగా కనిపిస్తుందని ఇంతవరకు నీట్పై సీఎం రేవంత్రెడ్డి స్పందించలేదని విమర్శించారు. గొర్రెల కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఈడీ జోక్యం చేసుకుందని.. నీట్ ప్రశ్న పత్రాలను లక్షలకు అమ్ముకున్నారని అందులో ఈడీ జోక్యం చేసుకోదా అని బాల్క సుమన్ కేంద్రాన్ని నిలదీశారు.