Harish Rao | ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోయింది: హరీశ్రావు
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై బీఆరెస్ అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వాయిదా వేసి ప్రభుత్వం పారిపోయిందని, అసెంబ్లీలో నిరుద్యోగులపై మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, నిరుద్యోగుల సమస్యలపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారని మాజీ మంత్రి టి.హరీశ్రావు ప్రభుత్వంపై మండిపడ్డారు.

నిరుద్యోగులపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదు
వాయిదా తీర్మానం స్పీకర్ తిరస్కరించారు
కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్రావు మండిపాటు
విధాత, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమస్యలపై బీఆరెస్ అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వాయిదా వేసి ప్రభుత్వం పారిపోయిందని, అసెంబ్లీలో నిరుద్యోగులపై మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, నిరుద్యోగుల సమస్యలపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారని మాజీ మంత్రి టి.హరీశ్రావు ప్రభుత్వంపై మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన మాజీ మంత్రి హారీష్ రావు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, ఆర్టీసీ యూనియన్ను పునరుద్ధరణ చేయడం లాంటి సమస్యలపై ప్రభుత్వం ఇప్పటి వరకు కార్యాచరణ చేపట్టలేదన్నారు.
రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని గమనిస్తున్నారన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆర్టీసీకి 300కోట్ల చెక్కును ఫిబ్రవరిలో ఇస్తే చెల్లలేదన్నారు. దానిపై సమాధానం లేదన్నారు. నేను రాష్ట్ర మంత్రి అయిన తర్వాత ఆర్టీసీ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా రాజీనామా చేశానని గుర్తు చేశానని, దీనిపై సీఎం రేవంత్రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో రకంగా మాట్లాడుండటాన్ని చూసి ఊసరవెల్లులు సైతం సిగ్గుపడుతున్నాయన్నారు.
అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయిందని, అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని, గ్రూప్1 మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారని, ఇప్పుడు అదే అంశాన్ని నిరుద్యోగులు అడిగితే పోలీసులతో లాఠీ ఛార్జ్ చేయిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ చెప్పిన జాబ్ క్యాలెండర్ ఎనిమిది నెలలైన ప్రకటించలేదన్నారు. రాష్ట్రంలో 21 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కాంగ్రెస్ వస్తే 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని, వెంటనే ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.