Egg Prices | అటు చికెన్, ఇటు మటన్ తినలేని వారంతా.. కోడిగుడ్ల వైపు మొగ్గు చూపిస్తారు. అంటే మధ్య తరగతి, దిగువ తరగతి కుటుంబాలకు చెందిన వారంతా కోడిగుడ్లను తింటుంటారు. ఎందుకంటే కోడిగుడ్డు ధర తక్కువగా ఉండడమే కారణం. కానీ గత వారం రోజుల నుంచి కోడిగుడ్ల ధరలు కొండెక్కుతున్నాయి. పది రోజుల్లోనే ఒక్కో కోడిగుడ్డు ధర రూ. 3 మేర పెరిగింది. దీంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది.
దాదాపు రెండు వారాల క్రితం ఒక్కో కోడిగుడ్డు ధర రూ. 4 ఉండగా, ఇప్పుడు రిటైల్ మార్కెట్లో ఒక్కో కోడిగుడ్డు ధర రూ. 7కు చేరింది. అయితే రిటైల్ దుకాణాల్లో కోడిగుడ్ల ధరలు ఒకే విధంగా ఉండగా, హోల్ సేల్ దుకాణాల్లో మాత్రం ఒక్కో కోడిగుడ్డు ధర రూ. 6.30 చొప్పున విక్రయిస్తున్నారు.
ధరల పెరుగుదలకు కారణం ఇదేనా..?
కోడిగుడ్ల ధరల పెరుగుదలకు కారణం.. కేవలం భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలే కారణమని పౌల్ట్రీ నిర్వాహకులు చెబుతున్నారు. భారీ ఉష్ణోగ్రతల నేపథ్యంలో.. కోళ్లు కూడా మరణానికి గురవుతున్నాయని, ఈ క్రమంలోనే కోడిగుడ్ల ధరలు ఆకాశాన్నంటాయని పేర్కొన్నారు. కోళ్లు మరణిస్తుండడంతో ఉత్పత్తి కూడా తక్కువగా ఉందన్నారు. అయినా కూడా కోడిగుడ్లకు డిమాండ్ భారీగానే ఉంది. సరఫరా తక్కువగా ఉండడంతో.. నష్టాలను పూడ్చుకోవడానికి కోడిగుడ్ల ధరలను పెంచాల్సి వస్తుందని ఓ కోళ్లఫారం యజమాని తెలిపారు.
ఈ వేసవిలో కోళ్ల మరణాల రేటు 30 శాతం ఎక్కువగా ఉందని తెలిపారు. ఇక కిలో చికెన్ ధర రూ. 240 ఉండగా, లైవ్ కోడిని రూ. 170కి విక్రయిస్తున్నారు. మొత్తంగా రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మహబూబ్నగర్ జిల్లాల్లో పౌల్ట్రీ ఫారాలపై తీవ్ర ప్రభావం నెలకొంది.
