Revanth Reddy । అమెరికాలో అదానీ లంచాల కేసు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఒక వైపు అదానీపై కాంగ్రెస్ కీలక నేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పోరాటం చేస్తుంటే మరోవైపు రాష్ట్రంలో అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభుత్వం విరాళాలు తీసుకోవడంపై ప్రతిపక్ష బీఆరెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నష్టనివారణ చర్యలకు దిగింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం మధ్యాహ్నం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు అదానీతో సహా ఏ సంస్థ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఫండ్ తీసుకోలేదని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. జరుగుతున్న వివాదాల నేపథ్యంలో అదానీ ఇస్తామన్న రూ.100 కోట్లు స్వీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని లేఖ రాశామని తెలిపారు. రూ.100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయొద్దని లేఖలో పేర్కొన్నామని చెప్పారు.
స్కిల్స్ యూనివర్సిటీ వివాదాస్పదం కాకూడదనే..
అదానీ నుంచి నిధులు స్వీకరించారని రాష్ట్ర ప్రభుత్వంపై కొందరు ఆరోపణలు చేస్తున్నారని రేవంత్రెడ్డి మండిపడ్డారు. చట్టబద్ధంగా ఏదైనా అంశంలో పెట్టుబడులు పెట్టేందుకు అందరికీ అవకాశాలు ఇవ్వాలనేది నిబంధన అని పేర్కొన్నారు. నిబంధనల మేరకు టెండర్లను దక్కించుకున్న ఏ సంస్థలకైనా పెట్టుబడులకు అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ స్పష్టంగా వివరించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి ఏర్పాటు చేసిన స్కిల్స్ యూనివర్సిటీ కోసం కార్పస్ ఫండ్ కింద పలు కంపెనీలు నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయని, అందులో భాగంగా అదానీ కూడా రూ.100 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని రేవంత్రెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. పక్క రాష్ట్రాల్లో, పక్క దేశాల్లో అదానీ విషయంలో జరుగుతున్న వివాదానికి తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. ఒక సదుద్దేశంతో ప్రారంభించిన స్కిల్స్ యూనివర్సిటీ వివాదాస్పదం కావడం ప్రభుత్వానికి ఇష్టం లేదన్న రేవంత్రెడ్డి.. అందుకే అదానీ నుంచి రూ.100 కోట్లు తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూసి వివాదాస్పదం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ ఎందుకు వెళుతున్నానంటే..
తన ఢిల్లీ పర్యటన మంత్రివర్గ విస్తరణ కోసమేనన్న వాదనను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొట్టిపడేశారు. ‘నేను ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి మీడియా మంత్రివర్గ విస్తరణ అంశాన్ని తెరపైకి తెస్తోంది. ఇవాళ్టి నా ఢిల్లీ పర్యటన ఓం బిర్లా కూతురు వివాహానికి హాజరు కావడానికి. ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం లేదు’ అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పార్లమెంటులో చర్చించాల్సిన అంశాలపై మంగళవారం పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులతో చర్చిస్తానని రేవంత్రెడ్డి చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులను తీసుకొచ్చేందుకు కావాల్సిన కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను, అనుమతుల కోసం అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను మంగళవారం కలుస్తామని పేర్కొన్నారు. కొంతమంది అర్రాస్ పాటలా తన పర్యటనకు లెక్కలేస్తున్నారని విమర్శించారు. తానేమీ వారిలాగ మోదీ ముందు మోకరిల్లడానికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. ‘ఎవరి కాళ్ళో పట్టుకోవడానికో, కేసుల నుంచి తప్పించుకోవడానికో, గవర్నర్ అనుమతి ఇవ్వొద్దని కోరేందుకో నేను ఢిల్లీ వెళ్లడం లేదు’ అని రేవంత్రెడ్డి చెప్పారు. గత పదేళ్లుగా తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్రం నుచి నిధులు తెచ్చుకోవడం మన హక్కు అన్నారు. ‘రాష్ట్రానికి రావాల్సిన నిధులు బీజేపీ తన ట్రెజరీ నుంచి ఏం ఇవ్వడం లేదు… కేంద్ర ప్రభుత్వ ట్రెజరీ నుంచే ఇస్తుంది. రాజకీయ పక్షపాతం చూపకుండా వారిని వెళ్లి కలిసినపుడే నిధులు రాబట్టుకోగలం. ఇందుకోసం ఎన్నిసార్లయినా ఢిల్లీ వెళతాం. మీ కడుపు మంట, దుఃఖం మాకు తెలుసు.. మీ కాకి గోలను మేం పట్టించుకోం’ అని స్పష్టం చేశారు. ఇది ఒకరిపై కోపం, పగ చూపాల్సిన సమయం కాదన్న ముఖ్యమంత్రి.. కార్యదీక్షతో తెలంగాణ అభివృద్ధి కోసం తాము ముందుకు వెళతామని చెప్పారు.
అదానీ ఫ్లైట్ లో ఆడంబరంగా తిరిగింది వాళ్లు
అదానీ ఫ్లైట్లో ఆడంబరంగా తిరిగింది వాళ్లేనంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి రేవంత్రెడ్డి పరోక్షంగా వ్యాఖ్యానించారు. పెట్టుబడుల విషయంలో ఎవరికీ ఆయాచిత లబ్ది చేకూర్చేది లేదని చెప్పారు. కేసీఆర్ లాగ తాము అదానీ నుంచి అప్పనంగా తీసుకోలేదని అన్నారు. ‘అదానితో ఇన్ని ఒప్పందాలు చేసుకున్నవారూ మాపై ఆరోపణలు చేస్తున్నారు’ అని విమర్శించారు. మహారాష్ట్ర నాందేడ్ లోక్ సభ ఎన్నికలో కాంగ్రెస్ గెలిచిందని, వయనాడ్ లో ప్రియాంక గాంధీకి రాహుల్ గాంధీ కంటే ఎక్కువ మెజారిటీ వచ్చిందని రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్రానికి ఒకరకంగా, కేంద్రానికి ఒక రకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. దేశంలో ఎక్కడ చూసినా బీజేపీని తిరస్కరించారని, మరి బీజేపీ నేతలు ఎందుకు సంబురాలు చేసుకుంటున్నారురో అర్థం కావడం లేదని అన్నారు. మాజీ మంత్రి, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ఆయన ఒక సైకో రామ్.. సైకో రామ్ గురించి ఎక్కువ మాట్లాడదలచుకోలేదు’ అని వ్యాఖ్యానించారు.