KTR | బీజేపీతోనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్థానం

సీఎం రేవత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం బీజేపీతోనేనని బీఆరెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ తర్వాతి రాజకీయ మజిలీ బీజేపీయేనని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

KTR | బీజేపీతోనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్థానం

చివరి మజిలీ బీజేపీతోనేనని మోదీ అమిత్‌షాలకు చెప్పాడు
దీనిపై నిజానిజాలు ప్రజలకు చెప్పాలని డిమాండ్‌
మహిళా కమిషన్ నోటీస్‌లు అందాయి
24న హాజరవుతానని వెల్లడి
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

విధాత, హైదరాబాద్ : సీఎం రేవత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం బీజేపీతోనేనని బీఆరెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ తర్వాతి రాజకీయ మజిలీ బీజేపీయేనని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. బీజేపీలో ఆయన తనబృందంతో చేరడం ఖాయమన్నారు. కేటీఆర్‌ శనివారం మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ అంటే ఎందుకు భయమో అసలు కారణాన్ని రేవంత్‌రెడ్డి ఈ మధ్యనే తన సన్నిహితుల వద్ద బయటపెట్టుకున్నారని కేటీఆర్‌ అన్నారు. తాను పుట్టింది బీజేపీలోనేనని.. చివరికి బీజేపీలోనే తన రాజకీయం ప్రస్థానం ముగుస్తుందని ప్రధానమంత్రికి, అమిత్‌షాలకు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారన్నారు. తాను కాషాయ జెండాతోనే ఏబీవీపీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించానని.. అదే జెండా కప్పుకొని చనిపోతానని మోదీతో చెప్పింది.. వాస్తవమా..? కాదా.. ? రేవంత్ చెప్పాలన్నారు. ఈ అంశంలో రేవంత్ ప్రజలకు స్పష్టతనివ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే అధికారిక నివాసంపై దాడి చేసిన వారిపై ప్రభుత్వం కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు. సీఎం సొంత మీడియా ప్రతినిధులు కమలాసన్‌రెడ్డి వంటి సీనియర్‌ అధికారిపై దాడి చేసినంత పని చేశారన్నారు. ఓ వైపు సీఎం అధికారిక మీడియానేమో ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ అధికారులపై దాడి చేస్తుందని, మరోవైపు సీఎం, ప్రభుత్వమేమో ప్రభుత్వ ఆస్తులపైనే దాడి చేస్తుందని విమర్శించారు. కేసీఆర్‌ గవర్నమెంట్‌ ఉన్న సమయంలో ఫాక్స్ కాన్ సంస్థ లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని అవగాహన ఒప్పందం కుదుర్చుకుందన్నారు. రేవంత్ రెడ్డి మాటలు, పరిపాలన వైఫల్యం కారణంగా ఫాక్స్ కాన్ ఏమైనా వెనక్కి వెళ్లిపోయిందా..? 40వేలతో చైనా తర్వాత అతిపెద్ద రెండో క్యాంపస్‌ని బెంగళూరులో ఏర్పాటు చేస్తామని సంస్థ చెప్పటం దేనికి నిదర్శనం నిలదీశారు. ఫాక్స్ కాన్ పెట్టుబడులపైన, విస్తరణపై ప్రభుత్వం నిజనిజాలను బయటపెట్టాలని.. తదుపరి విస్తరణను ఫాక్స్ కాన్ సంస్థ చేస్తుందా ? లేదా ? సీఎం చెప్పాలన్నారు. సీఎం, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిన మాటలు, చేస్తున్న దుష్ప్రచారం కారణంగానే ఫాక్స్ కాన్ కంపెనీ బెంగళూరుకి పోయిందా ? అనిపిస్తుందన్నారు.

రుణమాఫీ మోసంపై నిరసనలు

రాష్ట్రంలో రుణమాఫీకి 47లక్షల మందికి రుణమాఫీ కావాలని ఎస్ఎల్బీసీ చెప్పిందని.. రుణ మాఫీ కోసం రూ.40 వేల కోట్లు అవసరమవుతుందని రేవంత్ రెడ్డి చెప్పారని కేటీఆర్‌ గుర్తు చేశారు. రూ.31వేల కోట్లు అంటూ కేబినెట్ ఆమోదించిందని.. రూ.26వేల కోట్లంటూ బడ్జెట్‌ ఆమోదించిందని.. చివరకు రూ.17,984 కోట్లతో రుణమాఫీ అన్నారన్నారు. కేవలం 22లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారన్నారు. కనీసం 46శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదన్నారు. రైతు రుణమాఫీ విఫలమైన నేపథ్యంలో దాని నుంచి దృష్టి మళ్లించేలా అటెన్షన్ డైవర్షన్ కార్యక్రమాలను కాంగ్రెస్ చేస్తుందన్నారు. అందుకే సిద్ధిపేటలో హరీశ్‌రావు ఆఫ్‌సపై దాడి చేశారన్నారు. సీఎం వందశాతం రుణమాఫీ పూర్తి అయిందని చెబుతుంటే.. ప్రభుత్వం రుణమాఫీ కానీ వాళ్ల కోసం ప్రత్యేక కౌంటర్లు పెట్టడం డొల్ల వైఖరికి నిదర్శనమన్నారు. గ్రామస్థాయిలో రుణమాఫీ కానీ రైతుల వివరాలను పార్టీ శ్రేణుల ద్వారా సేకరిస్తామని.. వివరాలను కలెక్టర్లకు అందజేస్తామని.. ఆ తర్వాత ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. మా కాల్ సెంటర్‌కి దాదాపు 1.20లక్షల ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఒక ప్రొఫార్మా తయారు చేసి.. దాని ఆధారంగా సమాచారాన్ని సేకరిస్తామన్నారు. రెండురోజుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మొదలుపెడుతామని.. ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే కానీ, మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు కానీ బాధ్యతలు తీసుకుంటారన్నారు

మహిళా కమిషన్ విచారణకు హాజరవుతా

ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణంపై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రాష్ట్ర మహిళా కమిషన్ నుంచి నోటీసులు అందాయని, మెయిల్ ద్వారా నోటీసులు అందాయని కేటీఆర్ వెల్లడించారు. ఈనెల 24న ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ముందు హాజరవుతానని స్పష్టం చేశారు. మహిళా కమిషన్ ముందుకు తప్పకుండా వెళ్తానని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మహిళలపై జరిగిన దాడుల వివరాలు వారికి ఇస్తానని చెప్పారు. తాను బహిరంగ క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా నోటీసులు ఇచ్చారన్నారు. మా మహిళా ఎమ్మెల్యేలపై సీఎం, నేతలు వ్యాఖ్యలను కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు. తాను చట్టాలను గౌరవించే వ్యక్తినని చెప్పారు.