బీఆరెస్పై రాజకీయ ద్వేషంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్రెడ్డి విమర్శించారు
వ్యవసాయంపై ఒక్క మంత్రికీ అవగాహన లేదు
విధాత, హైదరాబాద్ : బీఆరెస్పై రాజకీయ ద్వేషంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఎన్డీఎస్ఏ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై సాకులు చెబుతున్నదని విమర్శించారు. ప్రభుత్వానికి నీళ్లు ఇచ్చే ఉద్దేశం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరంపై నాటకాలు ఆడుతున్నాయన్నారు. ఎన్టీఎస్ఏ హైదరాబాద్ రాకుండా ఢిల్లీ నుంచే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పినట్లు రిపోర్ట్ ఇచ్చిందని విమర్శించారు. మేడిగడ్డకు ఏదో జరిగిందని ప్రభుత్వం చెబుతున్నదని, ఇప్పుడు మేడిగడ్డ వద్ద 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నాయని చెప్పారు. పంప్హౌజ్లు నడిపితే ఎక్కడ కేసీఆర్కు పేరు వస్తుందోనని, మేడిగడ్డపై కాంగ్రెస్ చేసిన విమర్శలు వట్టివేనని తేలిపోతుందన్న భయంతోనే లిఫ్టులు వినియోగించడం లేదన్నారు.
వ్యవసాయంపై ఒక్క మంత్రికి కూడా అవగాహన లేదని విమర్శించారు. ఆంధ్రా బాసుల మోచేతి నీళ్లు తాగిన వీళ్లకు తెలంగాణ గురించి ఏం తెలుసని ఎద్దేవా చేశారు. కృష్ణా, గోదావరి నదులు ఆంధ్రా కోసమే పుట్టినట్లు గతంలో పాలకులు వ్యవహరించారన్నారు. నీళ్లు ఎలా లిఫ్ట్ చేయాలో తెలిసే కేసీఆర్ కన్నెపల్లి వద్ద పంప్ హౌస్ నిర్మించారన్నారు. గోదావరిలో నీళ్లు వృథాగా పోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పంప్హౌజ్లు నడపక పోవడంతో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, సింగూరు ప్రాజెక్టులు నీళ్లు లేక ఎండిపోతున్నాయని చెప్పారు. కోదాడ, సూర్యపేట నియోజకవర్గాల్లో రైతులు నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కోన్నారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాల దృష్ట్యా రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి కాళేశ్వరం పరిధిలోని పంప్హౌజ్లు నడిపించి ఆయకట్టు రైతాంగానికి నీళ్లు అందించాలని కోరారు.