బీఆరెస్ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్సభ బరిలో ఉంటానని ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు
విధాత : బీఆరెస్ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్సభ బరిలో ఉంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఎంపీగా పోటీ చేసే విషయమై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుదని పేర్కొన్నారు. గతంలో మల్కాజిగిరి ఎంపీగా పనిచేసిన అనుభవం ఉందని గుర్తు చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలైన మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఇటివల జరిగిన ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఇదే తరహాలో ప్రజలు బీఆరెస్ ఆదరిస్తారన్నారు. మల్కాజిగిరి లోక్సభ స్థానంతో పాటు రాష్ట్రంలో అత్యధిక లోక్సభ స్థానాలను బీఆరెస్ పార్టీ గెలుస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. బీఆరెస్ అధిష్టానం ఇప్పటికే లోక్సభ ఎన్నికల సన్నాహాలపై దృష్టి పెట్టి వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుందన్నారు. మల్కాజిగిరి లోక్ సభ స్థానం సమీక్షా సమావేశం ఈ నెల 21 తెలంగాణ భవన్లో జరుగనుందని తెలిపారు.