విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉత్కంఠ పోరు మొదలైంది. కాంగ్రెస్ అభ్యర్థి గౌవినోళ్ల మధుసూదన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. నువ్వా.. నేనా అన్నట్లు ఇరుపార్టీల పోరు సాగుతోంది. ఇప్పటికే ఇద్దరు అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియను పూర్తిచేసి, ప్రచారంపై దృష్టి పెట్టారు. గ్రామాల్లో ఓ విడత ప్రచార కార్యక్రమం కూడా పూర్తిచేశారు.
బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా దేవరకద్రలో సీఎం కేసీఆర్ ప్రచారం నిర్వహించి, అభివృద్ధి ప్రదాత ఆల వెంకటేశ్వర్ రెడ్డిని మరోసారి గెలిపిస్తే, ఈ నియోజకవర్గం ఇంకా అభివృద్ధిలో ముందుకు పోతుందనే సంకేతం ఇచ్చారు. కేసీఆర్ పర్యటనతో బీఆర్ఎస్ నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ జనాలను చూస్తే ఆల విజయం పొందినట్లే అని సీఎం నోటి వెంట మాట రావడంతో.. పార్టీ క్యాడర్ లో గెలుపు ధీమా కనపడుతోంది. ఈ నియోజకవర్గంలో ఆల హయాంలో వాగులపై చెక్ డ్యామ్ లు నిర్మించి నీటిని ఒడిసి పట్టడంలో సఫలీకృతుడయ్యారన్న పేరుంది.
పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి ఆలయం అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించారు. ఆల హయాంలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కరివేన జలాశయం నిర్మాణం కూడా ఇక్కడి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి ఎన్నికల్లో కలిసివచ్చే అవకాశంగా స్థానికంగా చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి కావడం, ప్రజల ఇబ్బందులు తొలగడంలో ఎమ్మెల్యే పాత్ర ఉండడం కూడా ప్లస్ పాయింట్ గా మారిందని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే మూడోసారి ఎమ్మెల్యేగా దేవరకద్ర నియోజకవర్గంలో చరిత్ర సృష్టిస్తారు.
కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ
దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్న గౌవినోళ్ల మధుసూదన్ రెడ్డి రోజురోజుకు ప్రచారం ముమ్మరం చేశారు. మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షులుగా ఉన్న ఆయనకు కాంగ్రెస్ శ్రేణుల్లో మంచి ఆదరణ ఉంది. ఇదేళ్ల నుంచి పదవిలో లేకున్నా ప్రజల మధ్య ఉంటూ, గ్రామాలకు కావాల్సిన వసతులు కల్పిస్తూ ప్రజాదరణ పొందారని ఆపార్టీ శ్రేణులు చెబుతున్నాయి. చాలా గ్రామాల్లో తాగునీరు ఇబ్బందులు లేకుండా చేయడం కూడా ఆయనకు ప్రజల్లో మంచి పేరొచ్చిందన్న చర్చ ఉంది.
ఇప్పటికే గ్రామాల్లో ఒక విడత ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరారు. మొదటి నుంచి టికెట్ ఆశించిన ప్రదీప్ గౌడ్ కు టికెట్ రాకపోవడంతో మనస్తాపం చెంది బీఆర్ఎస్ పంచన చేరారు. మరోనేత కొండ ప్రశాంత్ రెడ్డికి కూడా కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఆయన బీజేపీలో చేరి, దేవరకద్ర నియోజకవర్గం టికెట్ పొందారు. వీరు పార్టీ వీడినా కాంగ్రెస్ కు నష్టం లేదని మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు.
కాగా.. వారు పార్టీని వీడిన వెంటనే వారికి మద్దతుగా ఉన్న కార్యకర్తలు కాంగ్రెస్ వైపే ఉన్నారని ఆయన అంటున్నారు. క్యాడర్ లేని వ్యక్తులు ఉన్నా ఒకటే, పార్టీని వీడినా ఒక్కటే అని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నువ్వా, నేనా అనేలా పోరు మారింది.