Mahima Keerthana | నాగరిక సమాజంలోనూ ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. అన్నింట్లో అమ్మాయిలు రాణించాలని ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే ప్రభుత్వాలు.. ఆచరణకు వచ్చేసరికి మాత్రం ఆ మాటలను గాలికి వదిలేస్తున్నాయి. అంతేకాదు ఇటీవల జరిగిన ఇంటర్ సెకండియర్ ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం( English Question Paper )లోనూ లింగ వివక్షను ప్రదర్శిస్తూ ఓ ప్రశ్న అడిగారు. దీంతో లింగ వివక్ష ధోరణులపై ఓ ఇంటర్ విద్యార్థి( Inter Student )ని గళమెత్తారు. ఆడపిల్లలను కేవలం వంట గదికే పరిమితం చేస్తూ మగపిల్లలకే భవిష్యత్ ఉంటుందనేలా పాఠ్యాపుస్తకాల్లో ఉండటంపై కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కాలేజీ( Kachiguda Govt Junior College )లో ఇంటర్ సెకండియర్(ఎంపీసీ) అభ్యసించిన మహిమ కీర్తన(Mahima Keerthana ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రశ్నలు ఏంటంటే..?
ఇంటర్ సెకండియర్ ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలో.. డైలాగ్ రైటింగ్ విభాగంలో ఇచ్చిన రెండు ప్రశ్నలు ఇలా ఉన్నాయి. తన కుమార్తెకు వంట నేర్పాలనుకునే తల్లి, అమ్మాయి మధ్య సంభాషణ అందులో ఒకటి. మరో ప్రశ్న తన కుమారుడి భవిష్యత్ ప్రణాళికల గురించి తెలుసుకోవాలనుకునే తండ్రి, అబ్బాయి మధ్య సంభాషణ.
అమ్మాయిలే వంట చేయలా..?
అమ్మాయి అయితే వంట, అబ్బాయి అయితే భవిష్యత్ ప్రణాళికలా? వంట అంటే అమ్మాయిలే చేయాలా? ఈ ఆధునిక కాలంలో కూడా అమ్మాయిలను వంట గదులకు పరిమితం చేస్తారా? ఇలాంటి లింగ వివక్షతో కూడిన ప్రశ్నలు.. పాఠాలను మార్చండి’ అని మహిమ కీర్తన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
వంట చేయడం అనేది ఆడ, మగ అందరికీ అవసరమైన ప్రాథమిక నైపుణ్యం. దీన్ని కేవలం అమ్మాయిలకే పరిమితం చేయడం సరికాదు. అబ్బాయిలకు మాత్రమే కెరీర్ ఉంటుందా..? ఇలాంటి ప్రశ్నలు ఇవ్వడం సరికాదు. ఆధునిక కాలంలో కూడా ఇలా లింగ వివక్షకు సంబంధించిన ప్రశ్నలను అడగడం విద్యా వ్యవస్థ వైఫల్యమేనని సదరు విద్యార్థిని పేర్కొన్నారు.
అయితే.. తాను ఒక జాతీయ స్థాయి రైఫిల్ షూటర్నని, 2023లో తెలంగాణ రాష్ట్ర ఎస్జీఎఫ్ఐ ఛాంపియన్గా నిలిచానని గుర్తుచేశారు. నల్సార్ యూనివర్సిటీలోనూ తనకు ఎల్ఎల్బీ సీటు వచ్చిందని తెలిపారు. ‘నేను ఒక షూటర్గా, కాబోయే న్యాయవాదిగా నా భవిష్యత్ను తీర్చిదిద్దుకుంటున్నాను. నా తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి వంట చేస్తారు. సమాజంలో మార్పు రావాలని కోరుకునే విద్యావ్యవస్థే ఇలాంటి ప్రశ్నలతో విద్యార్థినులను వెనక్కి నెట్టడం విచారకరం’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
