Kadiyam Srihari : కేటీఆర్ అహంకారం, బలుపుతో మాట్లాడుతున్నాడు
కేటీఆర్పై కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు. “అహంకారం, బలుపుతో నాయకుడు కాలేవు. కేసీఆర్ లేకపోతే బిఆర్ఎస్ చెక్కలు అవుతుంది” అని వ్యాఖ్యానించారు.
విధాత, ప్రత్యేక ప్రతినిధి: అహంకారం, బలుపుతో మాట్లాడితే పెద్ద నాయకులు కాలేరని, దాన్ని ప్రజలు హర్షించరని కేటీఆర్ ను ఉద్దేశించి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడియం పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి కేటీఆర్ పై కడియం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ సభ్యత సంస్కారం మరిచి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను కేటీఆర్ లాగా అయ్య పేరు చెప్పుకొని, కుటుంబం పేరు చెప్పుకొని రాజకీయాలు చేయడం లేదని నేను స్వంతంగా ఎదిగిన నాయకున్ని అని స్పష్టం చేశారు. కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ఎక్కడ ఉండే వాడో అయన ఊహకే వదిలేస్తున్నాని అన్నాడు.
చెల్లికి సమాధానం చెప్పలేని దద్దమ్మ, సన్యాసి కేటీఆర్
కేటీఆర్ నాయకత్వంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కడియం అన్నారు. కేటీఆర్ నాయకత్వంపై నమ్మకం లేకనే కవిత వెళ్లిందనని అన్నారు. కేటీఆర్ కు సిగ్గు ఉంటే కవిత ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చెల్లికి సమాధానం చెప్పలేని దద్దమ్మ, సన్యాసి కేటీఆర్ అని విమర్శించారు. తన వద్ద ఆధారాలు ఉన్నాయి కాబట్టే కవిత ఆ విధంగా ఆరోపణలు చేస్తుందని తెలిపారు. ముందు నీ చెల్లికి సమాధానం చెప్పి కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలని సలహా ఇచ్చారు.
కేసీఆర్ లేని రోజు బిఆర్ఎస్ ముక్కలు
కేటీఆర్ నాయకత్వం నచ్చకనే హరీష్ రావు దూరంగా ఉంటున్నాడని అన్నారు. హరీష్ రావు కేసీఆర్ ఉన్నాడు కాబట్టే ఆగుతున్నాడని, కేసీఆర్ తర్వాత ఆయన దారి అయన చూసుకుంటాడని తెలిపారు. కేసీఆర్ ఉన్నంత వరకే బిఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఆ తర్వాత ముక్కలు, చెక్కలు అవుతుందని జోస్యం చెప్పారు. కేటీఆర్ పై ఇప్పటికే 10కేసులు ఉన్నాయని, అయన ఎప్పుడైనా జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడి రాజకీయం చేసి, స్కాములు చేసి కేటీఆర్ అడ్డగోలుగా దోచుకున్నాడని ఆరోపించారు.
కడియం దమ్మున్న నాయకుడు
100శాతం దమ్మున్న నాయకుడనని కడియం శ్రీహరి అన్నారు. నీతి, విలువల గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్ కు లేదని తెలిపారు. 10ఏళ్లలో 36మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని అందులో ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు నీతి విలువలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. గికుడుగాళ్లను, గోకుడుగాళ్ళను, తాగుబోతులను వెంటేసుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. బలుపుతో, అహంకారంతో మాట్లాడితే ప్రజలు హర్షించరని అన్నారు. తెల్లారి లేస్తే ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాల పైన ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. రాజకీయాలలో అందరూ లక్ష్యం తోనే పని చేస్తారని, కానీ మంచి నాయకునిగా ఎదగాలంటే అహంకారం, బలుపు తగ్గించుకొని సభ్యత సంస్కారం తో మాట్లాడాలని సూచించారు.
బిసిలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ పార్టీ విధానం, సంకల్పం అని తెలిపారు. బిసి రిజర్వేషన్లపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపితే కేంద్రంపై తేవాల్సిన బిఆర్ఎస్, బీజేపీ లు రాష్ట్రంలో అసత్య ప్రచారాలు, కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ కేంద్రంపై ఒత్తిడి తేకుండా కేసులకు బయపడుతున్నాడని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram