బస్సులో లేడీస్ మళ్లీ సీట్ల కోసం కుస్తీ
మహాలక్ష్మీ పథకం కింద మహిళల ఉచిత బస్సుల్లో సీట్ల వివాదం రచ్చకెక్కుతోంది. బస్సుల్లో సీటు కోసం పలువురు మహిళలు శిగలు పట్టుకుంటున్నారు

– ఫ్రీ బస్సులో సీటు కోసం కొట్టుకున్నారు
హైదరాబాద్: మహాలక్ష్మీ పథకం కింద మహిళల ఉచిత బస్సుల్లో సీట్ల వివాదం రచ్చకెక్కుతోంది. బస్సుల్లో సీటు కోసం పలువురు మహిళలు శిగలు పట్టుకుంటున్నారు. ఈ పథకం ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో తరచూ ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి మహిళల మధ్య ఇలాంటి వాగ్వాదమే చోటుచేసుకుంది. జహీరాబాద్ నుంచి సంగారెడ్డి వెళ్లే బస్సులో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. బస్సులో మొదటగా ఓ మహిళ కర్చీఫ్ వేసింది. అయితే ఆ కర్చీఫ్ని తీసి వేరే మహిళ తన సీటులో కూర్చోంది.
దీంతో కోపోద్రిక్తురాలైన మొదటి మహిళా ప్రయాణికురాలు.. ఆ తర్వాత సీటులో కూర్చున్న మహిళతో తగాదాకు దిగింది. ఇరువురూ ఒకరి జుట్టు మరొకరు పట్టుకొని కొట్టుకున్నారు. దీనికితోడు ఇద్దరి బంధువులు కూడా శిగపట్లు పట్టారు. మహిళల గొడవ చూసి బస్సులో ఉన్న ఓ చిన్నారి బోరున విలపించింది. మహిళల మధ్య ఘర్షణను ఆపేందుకు ఇతర ప్రయాణికులు ప్రయత్నించారు. కాసేపటి తర్వాత మహిళల మధ్య గొడవ సద్దుమనిగింది. అయితే.. ఆ బస్సులో ఉన్న కొంతమంది ప్రయాణికులు ఈ ఘటనను వీడి యో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ఆన్ లైన్లో వైరల్గా మారింది.