బి.సి మహా ధర్నాను జయప్రదం చేయండి

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ లో పొందుపరచిన కుల జనగణన, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు తదితర అంశాల సాధన కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద ఈ నెల 15 న బి.సి. కుల, సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరుగు మహా ధర్నాకు వేల సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ పిలుపునిచ్చారు

  • Publish Date - June 13, 2024 / 06:43 PM IST

ఈ నెల 15న ఇందిరా పార్కు వద్ద ధర్నా

ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్

విధాత, వరంగల్ ప్రతినిధి:కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ లో పొందుపరచిన కుల జనగణన, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు తదితర అంశాల సాధన కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద ఈ నెల 15 న బి.సి. కుల, సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరుగు మహా ధర్నాకు వేల సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ పిలుపునిచ్చారు. హన్మకొండ సిపిఐ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన బహుజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్షం వహిస్తుందని ఆయన అన్నారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి బి.సి కులగణన బిల్లు ఆమోదించాలని, కులగణనకు చట్టబద్ధత కల్పించాలన్నారు. కులగణన విధివిధానాల కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, కులగణనలో బీహార్ ర్రాష్టాన్ని మోడల్ గా తీసుకోవాలని కోరారు. ఇతర అంశాలైన స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు తదితర అంశాల అమలు ప్రణాళికలను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ మేధావుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొంగ వీరాస్వామి మాట్లాడుతూ నిత్యం శ్రమలో, చాకిరిలో ఉంటూ ఉత్పత్తిలో కీలక భూమిక పోషిస్తున్న బి.సి ల స్థితి నానాటికి దుర్భరంగా మారుతుందన్నారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ చింతకింది కుమారస్వామి మాట్లాడుతూ బి.సి లలో ఐక్యత, బలమైన నాయకత్వం లేకపోవడం వల్లనే నష్టం జరుగుతుందని, చెల్లాచెదరైన బి.సి సంఘాలను ఒక తాటిపై తెచ్చి హక్కులను సాధించాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, రాష్ట్ర నాయకులు డాక్టర్ కొంతం కృష్ణ, ఎఐఒబిసి రాష్ట్ర కమిటీ నాయకులు న్యాయవాదులు కూనూరు రంజిత్ గౌడ్, రాచకొండ ప్రవీణ్ కుమార్, ఎగ్గడి సుందర్ రామ్, పూలే సామాజిక న్యాయ వేదిక చైర్మన్ కేడల ప్రసాద్, తెలంగాణ జిల్లాల పూలే యువజన సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు జంపాల విశ్వ, విశ్రాంత ఉపాధ్యాయులు సైదులు, ప్రజా గాయకులు కొమరం సాకి, బిరుదురాజు శ్రీధర్ రాజు, మామిడి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Latest News