రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 200 మంది రైతులు చనిపోయారని, కాంగ్రెస్ వల్లే కరువు పరిస్థితులు ఉత్పన్నం అయ్యాయని మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ తిప్పి కొట్టారు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 200 మంది రైతులు చనిపోయారని, కాంగ్రెస్ వల్లే కరువు పరిస్థితులు ఉత్పన్నం అయ్యాయని మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ తిప్పి కొట్టారు
కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందనేది దుష్ప్రచారం
అధిక నిధుల కోసం కేంద్రంపై కొట్లాడండి
రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్
విధాత బ్యూరో, కరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 200 మంది రైతులు చనిపోయారని, కాంగ్రెస్ వల్లే కరువు పరిస్థితులు ఉత్పన్నం అయ్యాయని మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు చేస్తున్న దుష్ప్రచారాన్ని బిసి సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తిప్పి కొట్టారు. కరువు పరిస్థితులకు, రాజకీయాలకు సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో సోమవారం మంత్రి విలేకరులతో మాట్లాడారు. శాసనసభ ఎన్నికల అనంతరం నాలుగు నెలల తర్వాత బయటకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి సాగు, తాగునీటి అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. గత ఏడాది ఆగస్టు మాసంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, నాడు బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని గుర్తు చేశారు. ఎల్ నినో కారణంగా ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలోని జలాశయాల్లో ఉన్న నీటిని సాగు, తాగు అవసరాలకు ఎలా వాడుకోవాలో అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని చెప్పారు.
రాష్ట్రానికి నిధుల కోసం బీజేపీతో కేసీఆర్ కొట్లాడాలి
తెలంగాణలో కరువు పరిస్థితులు ఉత్పన్నం అయ్యాయని, సాగు, తాగు నీటికి ఇబ్బంది ఉందని ఈ దశలో అవసరమైన నిధులు కేటాయించి రాష్ట్రాన్ని ఆదుకోవాలని తాము కేంద్రాన్ని కోరుతున్నామని తెలిపారు. కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పుకొని రాష్ట్రానికి అధిక నిధులు తేవాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. తెలంగాణ బిడ్డగా రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడాను అంటున్న కెసిఆర్ రాష్ట్రానికి అవసరమైన నిధుల కోసం కాంగ్రెస్ తో కలిసి బిజెపితో కొట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై రాజకీయం చేసే బదులు ఢిల్లీ వెళ్లి కరువు పరిస్థితులు కేంద్రం దృష్టికి తెచ్చి అవసరమైన నిధుల కోసం అడగవలసిన బాధ్యత మాజీ ముఖ్యమంత్రి పై ఉందన్నారు.
రైతులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా…
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కొత్త డ్రామాలకు తెరతీసారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కల్లాలలోకి ఇంకా వడ్లు రాలేదని, అయితే సంజయ్ కల్లాల వద్దే బసచేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో కల్లాలలో వడ్లు ఉన్నప్పుడు, రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సంజయ్ ఎందుకు కనిపించలేదని ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్ కుమార్ కు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి అధిక నిధులు విడుదల చేయించేందుకు కొట్లాడాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు కేంద్రం నుండి సంజయ్ ఎకరాకు ఎంత నష్టపరిహారం ఇప్పిస్తే, రాష్ట్రం నుండి తాము అంతే పరిహారం ఇస్తామని స్పష్టం చేశారు.
ప్రజల ఆకాంక్షల మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం
రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగానే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ఆర్థిక క్రమశిక్షణ లేక ఏర్పడిన సంక్షోభంపై శ్వేత పత్రం విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా అప్పుల కుప్పగా మార్చినప్పటికీ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తాము చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని తెలిపారు.