Shridhar Babu | శాంతి భద్రతలు, రుణమాఫీపై మీరా మాట్లాడేది … బీఆరెస్ పై ఫైర్ అయిన మంత్రి శ్రీధర్ బాబు

శాంతి భద్రతలు, రుణ మాఫీ, స్థానిక సంస్థలు పై మాట్లాడే హక్కు బి ఆర్ ఎస్ కు లేదని మంత్రి శ్రీధర్ మండి పడ్డారు. రైతు సమస్యలంటూ బీజేపీ మొసలి కన్నీరు కారుస్తోందని ఎద్దేవా చేశారు.

Shridhar Babu | శాంతి భద్రతలు, రుణమాఫీపై మీరా మాట్లాడేది … బీఆరెస్ పై ఫైర్ అయిన మంత్రి శ్రీధర్ బాబు

విధాత: శాంతి భద్రతలు, రుణ మాఫీ, స్థానిక సంస్థలు పై మాట్లాడే హక్కు బి ఆర్ ఎస్ కు లేదని మంత్రి శ్రీధర్ మండి పడ్డారు. రైతు సమస్యలంటూ బీజేపీ మొసలి కన్నీరు కారుస్తోందని ఎద్దేవా చేశారు. మంగళవారం అసెంబ్లీ సమావేశం వాయిదా పడిన తరువాత సీల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిమ్మిని బమ్మిని చేయాలని బి ఆరెస్ నాయకులు చూస్తున్నారన్నారు. 31తేదీ లోగా బడ్జెట్ కు సంబంధించి అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు పెట్టాలని,లేకుంటే జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందన్నారు. 3రోజుల్లో బడ్జెట్ పై చర్చ ను పూర్తి చేయాలన్నారు. మాజీమంత్రి హరీష్ రావుకు అన్నీ ప్రొసీడింగ్స్ తెలుసన్నారు. బీఆరెస్ ప్రభుత్వ హయాంలో సమయం ఉన్నా 8 రోజులు కన్నా ఎక్కువ సభను జరపలేదన్నారు.

అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం స్పీకర్ ని కోరిందని శ్రీధర్ బాబు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు జరపాలని ప్రభుత్వం ఆలోచన ఉందన్నారు. తమ ప్రభుత్వం ఏ ఒక్క హామీని విస్మరించదని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ఆచరణతో ముందుకు పోతున్నామన్నారు.
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ దేనని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై చర్చ కు ప్రభుత్వం వెనక్కిపోదన్నారు. ప్రతిపక్షాలు ఇచ్చిన అంశాలపై స్పీకర్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారన్నారు. డిమాండ్లపై చర్చ సమయంలో అన్ని అంశాలపై కూలంకుషంగా మాట్లాడవచ్చునన్నారు.

తెలంగాణ అవసరాల దృష్ట్యా ఎక్కువ నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని మంత్రి తెలిపారు. తెలంగాణకు చట్ట ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సాధించటంలో గత బీ ఆరెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. నిధులు విషయంలో కేంద్రంపై పోరాటం చేస్తామన్నారు. విభజన చట్టానికి సంబంధించి ఎపి కి ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు కూడా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణపై కేంద్రం చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి
నిధుల విషయంలో కేంద్రంపై బీజేపీ నేతలు ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ప్రతిపక్షం అడిగిన ప్రతి అంశంపై సభలో చర్చిస్తామని తెలిపారు. ప్రధాని ని కలిస్తే బీజేపీకి దగ్గర అయినట్టు కాదన్నారు. బీజేపీ, బీఆరెస్ కలిసినట్టు కాంగ్రెస్ కలవదని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడంలో కేంద్రంపై పోరాటం చేస్తామని, సిఎం కూడా స్పందిస్తారన్నారు. ప్రతిపక్ష ఆరోపణలు సత్య దూరమన్నారు. రాజకీయ కోణంలో రాష్ట్రానికి అన్యాయం చేయవద్దని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. ప్రగతిశీల తెలంగాణకు నష్టం చేయవద్దని కేంద్రాన్ని కోరుతున్నామని తెలిపారు.