MLA Malla Reddy | ఇక ఎన్నికల్లో పోటీకి దూరం
నాకు 71ఏళ్లు వచ్చాయని, ఇక మీదట తాను ఎన్నికల్లో పోటీ చేయబోవడం మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

- అభివృద్ధి చేస్తే అప్పులు కావా
- మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
MLA Malla Reddy | విధాత : నాకు 71ఏళ్లు వచ్చాయని, ఇక మీదట తాను ఎన్నికల్లో పోటీ చేయబోవడం మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అమీర్ పేట మండలం అలియాబాద్ ఎక్స్ రోడ్ సీఎంఆర్ కన్వెన్షన్ లో మేడ్చల్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడారు.
రాజకీయంగా తనకు ఇదే చివరి ఐదేళ్ళు అని, ఈ ఐదేళ్లలో మీ అందరికీ మంచిగా సేవ చేస్తానన్నారు. ఈ నియోజకవర్గ ప్రజలే తన బందువులని, ఇన్నాళ్లు నియోజకవర్గంలో అనేక పనులు చేశానని రాబోయే రోజుల్లో మరిన్ని చేస్తానన్నారు. ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలనుంటే రైతుబంధు ఇప్పటిదాకా ఎందుకియ్యలేదని విమర్శించారు.
హామీల అమలు చేతగాక కాంగ్రెసోళ్లు మమ్మల్ని అప్పులు పాలు చేశారంటారు..అప్పులు కాకపోతే లంకె బిందెలు ఇచ్చిపోతరా పంచుకోవడానికంటు సెటైర్లు వేశారు. అభివృద్ధి చేసినప్పుడు అప్పు కాదా అని ప్రశ్నించారు. అంతా ఆన్లైన్ చేసే ఉందని, రైతుబంధు మేం 10వేలు వేశాం..మీరు 15వేలు వేయండి..మేం 2వేల పించన్ ఇచ్చాం..మీరు 4వేలు వేసేయండి ఎవరు ఆపుతారంటూ ప్రశ్నించారు.
మళ్లీ కొత్త దరఖాస్తులు ఎందుకంటూ నిలదీశారు. కాగా తాను ఇక ఎన్నికల్లో పోటీ చేయనంటునే పరోక్షంగా ఎంపీ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీకి మల్లారెడ్డి ఆసక్తి చూపుతుండటం గమనార్హం. తాను ఎంపీగా పోటీ చేసి, తన కొడుకును మేడ్చల్ ఎమ్మెల్యేగా చేయాలని మల్లారెడ్డి ఆలోచనగా ఉందన్న ప్రచారం వినిపిస్తుంది. అందుకే కేసీఆర్ను ప్రభావితం చేసేలా తనకు రాజకీయంగా ఇదే చివరి ఐదేళ్లంటూ వ్యాఖ్యానించారని కేడర్ చర్చించుకుంటుంది.