విధాత: రాహుల్ గాంధీపై, రేవంత్ రెడ్డిపై ఎంఐఎం అధినేతలు ఎంపీ అసదుద్దీన్, ఎమ్మెల్యే అక్భరుద్ధిన్ ఓవైసీలు తీవ్ర విమర్శలతో విరుచుకు పడ్డారు. ఇటీవల రాహుల్, రేవంత్లు వేర్వేరు సందర్భాల్లో చేసిన విమర్శలపై వారు కౌంటర్ వేశారు.
హైద్రాబాద్లో ఎంఐఎం నిర్వహించిన ఓ సమావేశంలో అసదుద్ధిన్ మాట్లాడుతూ ఓవైసీ కుటుంబం మహారాష్ట్ర నుంచి వచ్చిందటున్నావ్, నా తాత ముత్తాతలు హిందుస్తాన్లో పుట్టారని, నా పూర్వీకులు ఇక్కడ పుడితే నా దేశం ఇదే అనే హక్కు లేదా.. నువ్వు ఎక్కడ నుండి వచ్చావ్ రాహుల్ గాంధీ? అంటూ తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు.
తెలంగాణ కాంగ్రెస్ లీడర్ రేవంత్రెడ్డి మాట్లాడే మాటలు తెలంగాణ కాంగ్రెస్ నాలుక నుండి వచ్చిన మాటలు కావని, ఆర్ఎస్ఎస్ నాలుక నుండి వచ్చిన మాటలని, ముస్లింలు హిందూస్తాన్ వాళ్లు కాదు.. ఇస్లాం బయటినుండి వచ్చిందంటున్నాడని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ రెడ్డితో కలిసి పనిచేయడం నేను చూసానని, గుడిమల్కాపూర్ మార్కెట్ ఆ సమయంలో కార్వాన్ మార్కెట్ గా ఉన్నపుడు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డితో కలిసి పనిచేసాడన్నారు. రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో నీ సినిమా మొత్తం మా దగ్గర ఉందని, నువ్వు ముందు ఏబీవీపీలో ఉండి అక్కడి నుండి ఆర్ఎస్ఎస్, బీజేపీలలోకి వెళ్లావని విమర్శించారు.
ఆర్ఎస్ఎస్ వాళ్లు చంద్రబాబు దగ్గరికి వెళ్ళమంటే బీజేపీ నుంచి చంద్రబాబు పార్టీలోకి వెళ్లావని, చంద్రబాబు పని అయిపోగానే కాంగ్రెస్ లోకి వెళ్లావని, కాంగ్రెస్ ఇలాంటి ఆర్ఎస్ఎస్ వాళ్లని వారి పార్టీలోకి తీసుకుంటుందని ఓవైసీ దుయ్యబట్టారు.
మరో సమావేశంలో అక్భరుద్ధిన్ ఓవైసీ మాట్లాడుతూ మా తాత ముత్తాతలు హిందుస్తాన్లో పుట్టారని, మీ అమ్మమ్మ ఎక్కడ పుట్టింది? రాహుల్ గాంధీ అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఛార్మినార్ లోని భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి వచ్చి నేను ఆర్ఎస్ఎస్ లో పని చేయలేదని, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకినని ఒట్టు వేసి చెప్పాలని సవాల్ చేశారు.