Accreditation cards | అక్రెడిటేషన్ల గడువు మరో నెల పొడిగిస్తాం.. దరఖాస్తు ప్రక్రియ సరళతరం చేస్తాం : మంత్రి పొంగులేటి

పాత్రికేయ సంఘాల ప్రతిపాదన మేరకే అక్రెడిటేషన్‌ కమిటీలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. సమస్యలు పరిష్కరించేలోపు మరో నెలపాటు అక్రెడిటేషన్‌ కార్డుల గడువును పొడిగిస్తామని తెలిపారు.

Accreditation cards | పాత్రికేయ సంఘాల ప్రతిపాదన మేరకే అక్రెడిటేషన్‌ కమిటీలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. సమస్యలు పరిష్కరించేలోపు మరో నెలపాటు అక్రెడిటేషన్‌ కార్డుల గడువును పొడిగిస్తామని తెలిపారు. ఆదివారం ఖమ్మం నగరంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టుల అక్రెడిటేషన్‌, వెబ్‌సైట్‌ జర్నలిస్టులు, కేబుల్ చానల్స్, చిన్న పత్రికల సమస్యలపై మంత్రి పొంగులేటికి టీయూడబ్ల్యూజే ఐజేయూ జర్నలిస్టు యూనియన్ నాయకుల బృందం వినతి పత్రం అందజేసింది. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోల రామ్ నారాయణ ఈ సందర్భంగా మంత్రికి అన్ని విభాగాల పాత్రియేకులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. రాష్ట్రంలో 40వేల మంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్‌ కార్డులు ఇస్తామని చెప్పారని, కానీ.. ఇచ్చిన జీవో ప్రకారం చూస్తే 50% కార్డులు కూడా రావనే ఆందోళనతో జర్నలిస్టులు ఉన్నారని తెలిపారు. ఫ్రీలాన్సర్, వెటరన్ జర్నలిస్టులకు పెట్టిన నిబంధనలు కఠినంగా ఉన్నాయని చెప్పారు. వెబ్‌సైట్‌ ఓపెన్ చేస్తే అందులో అడిగే ప్రశ్నలు కార్డులు ఇచ్చేందుకు అడుగుతున్నట్టు లేవనే అభిప్రాయాలు కలుగుతున్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెబ్‌సైట్‌ ఫార్మాట్‌ సులభతరంగా లేదన్నారు.

జిల్లా అక్రెడిటేషన్‌ కమిటీలలో గత సంప్రదాయం ప్రకారం రిజిస్టర్డ్ యూనియన్ లెటర్ పంపితే కమిషనర్ ఆమోదించి, కమిటీలో సభ్యులుగా తీసుకున్నారని గుర్తు చేశారు. దానిని పక్కన పెట్టి కలెక్టర్లకు ఇప్పుడు అధికారం కల్పించడం అత్యంత విచారకరమన్నారు. పాత పద్ధతినే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత జీవో ప్రకారం కలెక్టర్ అందరినీ నామినేట్ చేస్తారనే ఉందని , ఇది సాధ్యం కాదని, కలెక్టర్‌కు కొత్త చిక్కులు తెచ్చి పెడుతుందని పేర్కొన్నారు.

జీవో ప్రకారం పెద్ద పత్రికలు, శాటిలైట్ చానల్స్, డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్‌ కార్డులు తగ్గుతున్నాయని తెలిపారు. దీంతో ఇబ్బందులు తప్పవనే ఆందోళనతో జర్నలిస్టులు ఉన్నారని పేర్కొన్నారు. చిన్న పత్రికల వారు కూడా తమకు గతంలో మాదిరిగా కార్డులు రావని ఆందోళనలో ఉన్నారని చెప్పారు. కేబుల్ చానల్స్ జర్నలిస్టులకు అన్యాయమే జరుగుతుందని స్పష్టంచేశారు. గతంలో కార్డులు పొందినవారు కూడా ఈసారి కార్డులు రావనే అందోళనకు గురవుతున్నారని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి… యూనియన్ల ప్రతిపాదన మేరకే అక్రెడిటేషన్‌ కమిటీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అక్రెడిటేషన్‌ల కోసం దరఖాస్తుకు ఉద్దేశించిన వెబ్‌సైట్‌ను కూడా సరళతరం చేస్తామని చెప్పారు. అక్రెడిటేషన్ల గడువు మరో నెల పొడిగిస్తామని చెప్పారు. పాత్రికేయులు, జర్నలిస్టు సంఘాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. అర్హులందరికీ అక్రెడిటేషన్‌ కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. మంత్రిని కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కమిటీ సభ్యులు మాటేటి వేణుగోపాల్, మాజీ జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, యూనియన్ జిల్లా కార్యదర్శి మైస పాపారావు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు మామిడాల భూపాల్, జర్నలిస్టుల జిల్లా హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కనకం సైదులు, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు మోయినుద్దీన్, జిల్లా కోశాధికారి నాగండ్ల శివ తదితరులు ఉన్నారు.

Latest News