- ముందే ఓటమి అంగీకరించిన కేసీఆర్
- బీఆరెస్ తన ఉనికిని కోల్పోయింది
- కేసీఆర్ ఆలోచన శక్తి కోల్పోయారు
- బీఆరెస్కు ఆలోచన, ఆచరణ లేవు
- సంక్షేమం, అభివృద్ధిపై చిత్తశుద్ధీ లేదు
- కేసీఆర్ పాలనకు ఎక్స్పైరీ డేట్ వచ్చింది
- మావి ఆచరణ సాధ్యం కాదన్నారు..
- ఇప్పుడవే వారి మానిఫెస్టోలో పెట్టారు
- మందు, డబ్బు పంచకుండా ఓట్లగగలరా?
- 17న అమరుల స్తూపం వద్ద ప్రమాణం చేద్దాం
- ముఖ్యమంత్రి కేసీఆర్కు రేవంత్రెడ్డి సవాల్
విధాత : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను కాపీ కొట్టి బీఆరెస్ తన మ్యానిఫెస్టోను ప్రకటించిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శించరు. తమ గ్యారెంటీలను కాపీ కొట్టడం ద్వారా కేసీఆర్ పెద్ద అగాథంలో పడిపోయారని చెప్పారు. బీఆరెస్ తన ఉనికిని కోల్పోయిందని, కేసీఆర్ ఆలోచన శక్తి కోల్పోయారని ఎద్దేవా చేశారు. ఇవాళ ప్రెస్మీట్లో రాబోయే ఎన్నికల్లో ఓటమిని అంగీకరించిన కేసీఆర్ కనిపించారని, కాడి కిందపడేసిన కేసీఆర్ కనిపించారని రేవంత్రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనకు ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని, ఇక కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. బీఆరెస్కు ఆలోచన, ఆచరణ, సంక్షేమం- అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని రేవంత్రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆరెస్ ఎన్నికల ప్రణాళికపై విరుచుకుపడ్డారు. తాము ఆరు గ్యారంటీలు ఇస్తామంటే బీఆరెస్ నేతలు అదెలా సాధ్యమన్నారని, కానీ ఇప్పుడు బీఆరెస్ నేతలు కాంగ్రెస్ను ప్రశ్నించే అర్హత కోల్పోయారని అన్నారు.
కేసీఆర్ మ్యానిఫెస్టోను చిత్తుకాగితంగా అభివర్ణించిన రేవంత్రెడ్డి.. దానిపై చర్చ అనవసరమన్నారు. కేసీఆర్లా తాము ఉత్తుత్తి హామీలు ఇవ్వలేదని చెప్పారు. తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీను అమలు చేయగలమని స్పష్టం చేశారు. “మహాలక్ష్మి పథకం కింద మేం రూ.2,500 అంటే కేసీఆర్ ఇవాళ రూ.3 వేలు అన్నారు… ఆడబిడ్డలకు మేం రూ.500 గ్యాస్ సిలిండర్ అంటే ఆయన రూ.400 అన్నాడు… పెన్షన్ల విషయంలో మేం రూ.4 వేలు అంటే ఆయన రూ.5 వేలు అన్నాడు… మేం ఇందిరమ్మ భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు రూ.15 వేలు ఇస్తామంటే… ఆయన ఇప్పుడు రూ.16 వేలు ఇస్తామంటున్నాడు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటూ గతంలో సారా పాటలు నిర్వహించేవారు. అయితే, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అనకుండానే కేసీఆర్ మమ్మల్ని కాపీ కొట్టి పెద్ద లోయలో పడిపోయారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే… రాష్ట్రం దివాళా తీయడమే కాదు, కేసీఆర్ బుర్ర కూడా దివాళా తీసింది. కేసీఆర్ లో ఆలోచించే శక్తి సన్నగిల్లింది” అని రేవంత్ రెడ్డి విమర్శించారు. తమ గ్యారెంటీలను కాపీ కొట్టడం ద్వారా తమ గ్యారెటీల అమలు సాధ్యమేనని కేసీఆర్ రాజముద్ర వేసి మరీ అంగీకరించారని చెప్పారు. కాంగ్రెస్ హామీలు ఆచరణ సాధ్యమేనని కేసీఆర్ ప్రెస్మీట్తో ప్రజలకు అర్థమైందన్నారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాను కలర్లో చూపించినట్లు బీఆరెస్ మ్యానిఫెస్టో ఉన్నదని, పాత హామీలనే అమలు చేయకుండా.. ఇప్పుడు మరో సారి మోసం చేద్దామని ముందుకొచ్చినట్లు ఉందని విమర్శించారు. కేసీఆర్, బీఆరెస్ ఇక ఎంతమాత్రం స్వయం ప్రకాశకులు కాదని అన్నారు. కేసీఆర్, ఆయన పార్టీ పరాన్నజీవులని ఆరోపించారు. ప్రజా సంక్షేమం పట్ల ఆలోచన, చిత్తశుద్ధి బీఆరెస్కు లోపించాయనడానికి వాళ్ల మ్యానిఫెస్టోనే నిదర్శనమని వ్యాఖ్యానించారు. గత రెండేళ్లుగా ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ కాగితంపై రాసుకుని, ఇవాళ బీఆరెస్ మ్యానిఫెస్టోను విడుదల చేశారని రేవంత్రెడ్డి విమర్శించారు. మేం రూ.4 వేల పెన్షన్, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటే… అదెలా సాధ్యమవుతుంది? అంటూ ఇన్నాళ్లు మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు వారి మేనిఫెస్టో పట్ల ఏం సమాధానం చెబుతారు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వందకు వంద శాతం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఆమలు చేస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అర్థంపర్థం లేని ఆరోపణలతో బిల్లా రంగాలు కాంగ్రెస్పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అందుకే ఎక్కడో డబ్బులు దొరికితే తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో సొమ్ము దొరికితే కాంగ్రెస్ ఏం సబంధమని ప్రశ్నించారు. దోపిడీ సొమ్ముతో జాతీయ రాజకీయాలు చేయాలని ప్రయత్నించిన కేసీఆర్ విఫలమయ్యారని, అందుకే చలి జ్వరంతో ఇంట్లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు.
సవాలుకు సిద్ధమా?
ఈ ఎన్నికల్లో మందు పోయకుండా, డబ్బు పంచకుండా ఓట్లు అడిగే దమ్ము కేసీఆర్కు ఉన్నదా? అని రేవంత్రెడ్డి.. కేసీఆర్కు సవాలు విసిరారు. 17వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్తూపం వద్దకు తాను వస్తానని, కేసీఆర్ వస్తే ఇద్దరం కలిసి ఈ మేరకు ప్రమాణం చేద్దామని అన్నారు.
నిజంగా రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీయకపోతే ఉద్యోగులకు, ఆసరా పెన్షనర్లకు ప్రతీ నెలా మొదటి తారీఖు వాళ్ళ ఖాతాలో జమ చేయాలని సవాలు చేశారు. అలాగైతేనే బీఆరెస్ మ్యానిఫెస్టోను నమ్ముతామని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైందన్న రేవంత్.. జాబితాలో ఉన్నవారికి అభినందనలు తెలిపారు. తాము అభ్యర్థులను ప్రకటించగానే.. కేసీఆర్ వారి అభ్యర్థులకు బీ-ఫామ్లు పంచారన్న రేవంత్.. అభ్యర్థుల విషయంలో బీఆరెస్ కంటే కాంగ్రెస్ ముందు ఉందని చెప్పారు. తాము 55 మంది అభ్యర్థులను ప్రకటిస్తే.. కేసీఆర్ 51 మందికే బీ ఫామ్లు ఇచ్చారని చెప్పారు.
మూడు విడతలుగా బస్సు యాత్ర
రాష్ట్రంలో మూడు విడతలుగా విజయభేరీ బస్సుయాత్ర ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు.
మొదటి విడుతలో మూడు రోజులు బస్సు యాత్ర దసరా తర్వాత రెండవ దశ బస్సు యాత్ర, నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత మూడవ దశ బస్సు యాత్ర ఉంటుందని ఆయన తెలిపారు.
ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరిగే తొలి విడత బస్సు యాత్రలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొంటారు.18న రామప్ప దేవాలయంలో శివుడికి పూజ చేసి బస్సు యాత్ర ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు. అదే రోజు భూపాలపల్లి లో మహిళలతో సమావేశం, 19న రామగుండంలో సింగరేణి కార్మికులతో సమావేశం, పెద్దపల్లిలో పాదయాత్ర, సభ, కరీంనగర్ లో పాదయాత్ర , సభ
20 న జగిత్యాల, బోధన్, నిజామాబాద్ లో పాదయాత్ర, సభలు ఉంటాయని రేవంత్ రెడ్డి తెలిపారు.