ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆరు నెలలైనా హామీల అమలు మరచి గత ప్రభుత్వాల పై నిందలు వేస్తూ పబ్బం గడుపుతున్నదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి విమర్శించారు.
సూర్యాపేట: ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆరు నెలలైనా హామీల అమలు మరచి గత ప్రభుత్వాల పై నిందలు వేస్తూ పబ్బం గడుపుతున్నదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి విమర్శించారు. విద్యుత్ కొనుగోళ్ళు, కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకుంటూ కమీషన్ల ఏర్పాటు పేరుతో డ్రామాలు చేస్తున్నారని అన్నారు. ‘విచారణ కమిషన్లు వాటి పని అవి చేసుకుంటాయి. ప్రభుత్వం ఎందుకు లీకులు ఇస్తుంది?’ అని ఆయన నిలదీశారు. ఎన్నికల కోడ్ ముగిశాక హామీల అమలుపై ప్రజలు నిలదీస్తారనే కమిషన్ల విచారణ పేరుతో మీడియాకు లీకుల డ్రామాలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పసలేని ఆరోపణలన్నీ వరుసగా తెలిపోతున్నాయని చెప్పారు.
కాళేశ్వరంలో నీళ్ళు నిలిపి, పొలాలకు సాగు నీరు అందించకుండా తప్పు చేస్తున్నారని జగదీశ్రెడ్డి విమర్శించారు. నాలుగు నెలలుగా సమయం వృథా చేసి, ఇప్పుడు హడావిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ లోపాలంటూ ఆరోపణలను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. నీళ్ళు, విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజలు మంచినీళ్ళ కోసం రోడ్లెక్కే పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. పదేళ్ళ క్రితం ఉన్న దుస్థితి మళ్ళీ దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి విత్తనాల కొరతలో ప్రభుత్వ పెద్దలు పాత్ర ఉందని, పత్తి విత్తనాల బ్లాక్ దందా పై ఓ మంత్రి పాత్ర ఉందని జగదీశ్రెడ్డి ఆరోపించారు. ఆధారాలు రాగానే త్వరలో పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడిస్తామని, ప్రభుత్వ చేతగానితనాన్ని ప్రజల్లోకి తీసుకెళతామని చెప్పారు. ఇచ్చిన హామీల పై దృష్టి పెట్టకుండా కాంగ్రెస్ తపోయించుకునే ప్రయత్నం చేస్తోందని, మీడియాకు లీకులిచ్చి చెత్త, రోత రాతలు రాపిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కమిషన్లు వేసినా అభ్యంతరం లేదన్నారు. కమిషన్ల విచారణ కంటే మీడియా లీకులు ఎక్కువైయ్యాయని చెప్పారు. కమిషన్ల విచారణ పేరుతో రైతు రుణమాఫీపై దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నదని జగదీశ్రెడ్డి విమర్శించారు.