Decomposed Meat | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తమ తనిఖీలను వేగవంతం చేశారు. నగరంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఫుడ్ గోదాంలపై దాడులు చేసి.. భారీ మొత్తంలో కల్తీ పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్నారు.
తాజాగా అందిన విశ్వసనీయ సమాచారంతో.. మంగళ్హాట్ పోలీసు స్టేషన్ పరిధిలోని కిస్తీచమన్ దర్గా సమీపంలో నిర్వహిస్తున్న ఏ టూ జడ్ షీప్ అండ్ గోట్ ఆఫల్స్ గోడౌన్పై జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భయంకరమైన దృశ్యాలు వెలుగుచూశాయి. 14 టన్నుల కుళ్లిన మాంసాన్ని అధికారులు గుర్తించి సీజ్ చేశారు. మేక, గొర్రెలకు సంబంధించిన తలకాయ, బోటి, కాళ్లు, బ్రెయిన్ వంటి విడిభాగాలను పెద్ద ఎత్తున అపరిశుభ్ర వాతావరణంలో భద్రపరిచారు. వీటన్నింటిని ప్లాస్టిక్ కవర్లలో చుట్టి ఉంచారు. కుళ్లిపోయిన మాంసాన్ని రసాయనాలతో శుభ్రపరిచి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఈ మాంసాన్ని నగరంలోని హోటల్స్కు, శుభకార్యాలకు సరఫరా చేసి అక్రమంగా సంపాదిస్తున్నారు. ఈ ఘటనలో ఏ టూ జడ్ నిర్వాహకుడు మహ్మద్ అఫ్రోజ్(41)ను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని, నగరంలో విక్రయిస్తున్నట్లు తేలింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు కూడా వెనుకాడేది లేదని అధికారులు హెచ్చరించారు.
