విధాత : వీబీ జీ రామ్ జీ పథకంలో గ్రామాల అభివృద్ది కోసం ప్రతి గ్రామానికి రూ.2కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాలన్ వెల్లడించారు. తిరుపతిలో వీబీ జీరామ్జీ పథకానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, మంత్రులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. అందుకే ఈ పథకం కింద రూ.7.5లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం. ప్రతి గ్రామానికి ఉపాధి కార్యక్రమాల కోసం రూ.2 కోట్లు అందజేస్తాం. చేసిన పనికి వేతనం ఆలస్యం కాకూడదనే మార్పులు చేశాం అని తెలిపారు. కార్మికుడి కష్టార్జితాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తామని పేర్కొన్నారు.
గ్రామాలకు రూ. 2కోట్ల చొప్పున అందించే నిధులను గ్రామానికి ఉపయోగపడే ఏ పనైనా చేసుకోవచ్చన్నారు. వెనుకబడిన పంచాయతీల్లో ఎక్కువ నిధులు వినియోగించుకొనే అవకాశం ఉందన్నారు. ఏ పనులు చేపట్టాలన్నా గ్రామాలకే అధికారం కల్పించాం. ఈ పథకం కింద ఏ పనులు చేయాలన్నా స్థానికంగానే నిర్ణయం తీసుకోవచ్చు అని శివరాజ్ సింగ్ వెల్లడించారు.