ఉప్పల్ భగాయత్ భూపోరాటంలో కల్వకుంట్ల కవితకు గాయాలు!

తెలంగాణ ఉద్యమకారులకు ఉప్పల్ భగాయత్ లో ప్రభుత్వ భూములను పంపిణీ చేయాలంటూ 'భూపోరాటం' పేరిట గురువారం కార్యకర్తలు, ఉద్యమకారులతో కలిసి కవిత నిర్వహించిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కవితను పోలీసులు అరెస్టు చేశారు.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Jul 02, 2026, 2:05 pm IST
Read Time: 3 mins
ఉప్పల్ భగాయత్ భూపోరాటంలో కల్వకుంట్ల కవితకు గాయాలు!

విధాత, హైదరాబాద్ : బావ హరీశ్ రావు, అన్న కేటీఆర్ లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై సవాళ్ల యుద్దం సాగించిన రోజునే ..ఇంకోవైపు కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ నుంచి ఉప్పల్ భగాయత్ తో భూపోరాటంతో వార్తల్లో నిలిచారు. తెలంగాణ ఉద్యమకారులకు ఉప్పల్ భగాయత్ లోని ప్రభుత్వ భూములను పంపిణీ చేయాలంటూ ‘భూపోరాటం’ పేరిట గురువారం కార్యకర్తలు, ఉద్యమకారులతో కలిసి కవిత నిర్వహించిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కవితను పోలీసులు అరెస్టు చేశారు.

ఉప్పల్ బగాయత్‌లో కవిత తలపెట్టిన భూ పోరాట సభను పోలీసులు మధ్యలోనే అడ్డుకోగా.. మేడిపల్లి-బోడుప్పల్ వద్ద ధర్నా నిర్వహించాలని కవిత నిర్ణయించారు. అయితే అక్కడ కూడా సభ జరగకుండా పోలీసులు అడ్డుకోవడంతో, పోలీసులకు, టీఆర్ఎస్ (తెలంగాణరక్షణ సేన) కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఆ సమయంలో జరిగిన తోపులాటలో కవిత కిందపడిపోవడంతో గాయపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కవితను పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లి కారులో ఎక్కించారు. కవితతో పాటు పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. . ఉద్యమకారులపై లాఠీచార్జీ చేసి వారి రక్తం కళ్ల చూసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని కవిత హెచ్చరించారు.