పరిగణలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు
జూన్ 3న నిందితులంతా హాజరుకావాలని సమన్లు
విధాత, హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ కేసు మనీలాండరింగ్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కవితకు ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈ కేసు విచారణలో భాగంగా ఈనెల 10న బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత, ఇతర నిందితులపై ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కవిత, చరణ్ ప్రీత్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్లను నిందితులుగా ఈడీ పేర్కొంది. ప్రస్తుతం కవిత, చరణ్ ప్రీత్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
కవిత, చరణ్తో పాటు చార్జిషీట్లో ఉన్న నిందితులంతా జూన్ 3న జరిగే తదుపరి విచారణకు కోర్టు ముందు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. దీంతో వచ్చే నెల 3న కవితను జైలు అధికారులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరో వైపు కవిత బెయిల్ పిటిషన్లపై ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు జడ్జి స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వు చేశారు. ఈ క్రమంలో రౌస్ అవెన్యూ కోర్టు మాత్రం ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్ ను పరిగణలోకి తీసుకుని ఇందులో నిందితులుగా ఉన్న వారందరిని విచారణకు పిలవడం హాట్ టాపిక్ గా మారింది.