తెలంగాణ ప్రభుత్వం అధికారిక కొత్త చిహ్నం ఆవిష్కరణ నిర్ణయం ఈ జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా లేనట్లేనన్న వార్తలు వినిపిస్తున్నాయి
మరిన్ని సంప్రదింపుల తర్వాతే నిర్ణయం
నిరసనలకు జడిసే వెనుకడుగన్న ప్రతిపక్షాలు
విధాత, హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల్లో సర్వాత్రా ఆసక్తి రేపిన తెలంగాణ అధికారిక కొత్త చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. అదిగో ఇదిగో కొత్త అధికారిక చిహ్నం అంటూ సాగిన ప్రచారానికి తోడు సోషల్ మీడియాలో ఇదిగో ఇవే మూడు డిజైన్లు..అదే ఫైనల్ లోగో అని ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. అదే సమయంలో బీఆరెస్ అధికారిక చిహ్నం(రాజముద్ర) మార్పుపై నిరసనలకు సైతం దిగింది. అయితే కొత్త అధికారిక చిహ్నం ఖరారులో కొన్ని రోజులుగా హడావుడి చేసిన ప్రభుత్వం అనూహ్యంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
తొలుత తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న కొత్త అధికారిక రాజముద్ర లోగోను విడుదల చేయాలని సీఎం రేంవత్రెడ్డి ప్రభుత్వం భావించింది. ఇప్పుడు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 2న కాకుండా మరో రోజున లోగో విడుదల చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, తెలంగాణ సమాజంలోని పలు వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకతతో ప్రభుత్వం అధికారిక చిహ్నం మార్పు నిర్ణయంపై పునరాలోచనలో పడిందని, దీనిపై 200 వరకు సూచనలు రావడంతో మరిన్ని సంప్రదింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా తెలంగాణ గీతం జయజయహే తెలంగాణను మాత్రం జూన్ 2వ తేదీనే విడుదల చేస్తారని తెలుస్తోంది.
అధికారిక చిహ్నం మార్పుపై మరింత కసరత్తు
ప్రస్తుతం అమల్లో ఉన్న అధికారిక చిహ్నంలో రాచరికపు గుర్తులున్నాయని, వాటిని తొలగించాలని ఇప్పటికే రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. దీనిపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు చర్చించారు. కొన్ని నమూనాలు సిద్ధం చేశారు. ప్రజలు, ప్రజాజీవితం, ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం తదితర అంశాలు ప్రతిబింబించేలా కొత్త చిహ్నం ఉండాలని నిర్ణయించారు. ఈ కోణంలో రూపొందించిన డిజైన్లలో ప్రధానంగా మూడింటిని పరిశీలించి తుదకు ఒక లోగోను ఫైనల్ చేశారు. కొత్త లోగోలో కాకతీయ తోరణం, చార్మినార్ స్థానంలో అమరవీరుల స్థూపం, వరి పంట గొలుసులకు అవకాశం కల్పించారు. తుదిగా ఖరారు చేసిన కొత్త అధికారిక చిహ్నంపై పలువురు మేధావులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, ఉద్యమకారులతో సీఎం రేవంత్రెడ్డి చర్చించారు.
అయితే మంత్రివర్గ సహచరులకు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా వాటిని చూపించి, వారి సలహాలు, సూచనలు కూడా స్వీకరించి.. తుది రూపు ఇవ్వాలని రేవంత్ నిర్ణయించారు. మరిన్ని సలహాలు, సూచనలు స్వీకరించిన అనంతరం రాష్ట్ర అధికారిక చిహ్నానికి తుది రూపు ఇవ్వనున్నారు. అదిగాక తెలంగాణ రాజముద్ర మార్పుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం కావాల్సివుండటంతో ఇప్పటికిప్పుడు ఈ ప్రక్రియ సాధ్యంకాకపోవచ్చన్న ఆలోచన కూడా కొత్త రాజముద్ర ఆవిష్కరణకు మరో కారణమన్న వాదన కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో జూన్ 2న రాష్ట్ర గీతం మాత్రమే విడుదల చేయనున్నారని సమాచారం.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించిన అందెశ్రీ గీతం ‘జయ జయహే తెలంగాణ’ స్వరాలకు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇందులో పూర్తి గీతాన్ని 13.30 నిమిషాల నిడివితో రూపొందించారు. రాష్ట్ర అధికారిక కార్యక్రమాల్లో, జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు తెలంగాణకు వచ్చిన సందర్భంగా ఆలపించడానికి వీలుగా.. 2,30 నిమిషాల నిడివితో మరో గీతాన్ని రూపొందిస్తున్నారు. ప్రధాన గీతం ప్రాధాన్యత తగ్గకుండా అందెశ్రీ దీన్ని తీర్చిదిద్దారు. ఈ రెండు గీతాలకు కీరవాణి స్వరాలను సమకూరుస్తున్నారు.
నిరసనలకు జడిసే వెనుకడుగన్న ప్రతిపక్షాలు
తెలంగాణ అధికారిక చిహ్నం మార్పు ప్రయత్నం పట్ల ఎదురవుతున్న ప్రజావ్యతిరేకత..ప్రతిపక్షాల నిరసనతో కొత్త అధికారిక చిహ్నం ఆవిష్కరణను కాంగ్రెస్ ప్రభుత్వం వాయిదా వేసుకుందని బీఆరెస్, బీజేపీలు చెబుతున్నాయి. విస్తృత సంప్రదింపులు లేకుండా ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా ఏకపక్షంగా రాజకీయ వైషమ్యాల కోణంలో అధికారిక చిహాన్ని మార్చాలనుకోవడం రేవంత్రెడ్డి ప్రభుత్వం అనాలోచిత, అవివేక చర్యగా ఆ పార్టీలు అభివర్ణించాయి. బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఏకంగా చార్మినార్ వద్ద నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వ చర్యను తప్పుబట్టారు. చార్మినార్ను రాజముద్ర నుంచి తొలగించడమంటే ప్రతీ హైదరాబాదీని అవమానపర్చినట్టేనని, తెలంగాణ వారసత్వ సంపద, సంస్కృతికి గుర్తులుగా ఉన్న చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని రాజముద్ర నుంచి తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనిపై రాష్ట్ర వ్యాప్త ప్రజా ఉద్యమాన్ని చేపడుతామని హెచ్చరించారు.