కాంగ్రెస్, బీఆరెస్ రెండు పార్టీలు కూడా అవినీతి, కుటుంబ పార్టీలేనని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ విమర్శించారు. శుక్రవారం ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు నామినేషన్ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు
విధాత : కాంగ్రెస్, బీఆరెస్ రెండు పార్టీలు కూడా అవినీతి, కుటుంబ పార్టీలేనని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ విమర్శించారు. శుక్రవారం ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు నామినేషన్ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో అవినీతి రహిత ప్రభుత్వం కావాలని బీజేపీ కోరుకుందన్నారు. బీఆరెస్ అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో తరిమి కొట్టారని పేర్కొన్నారు. దాదాపు 70 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కుంభకోణాల చరిత్రేనని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర వహించిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి పదేళ్లలో 10లక్షల కోట్ల సహాయం అందించిందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో దేశ రక్షణ..అభివృద్ధి వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు బీజేపీ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో ఒక్క కుంభకోణం లేదని.. మోడీ ప్రభుత్వం చెప్పిందే చేస్తుందన్నారు. మోదీ ప్రభుత్వం మాటలు ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు.జమ్ము కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు లాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. బీజేపీ మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు చేశామని చెప్పారు. త్రిపుల్ తలాక్ ఎత్తేశామని… మహిళలకు గౌరవం ఉండాలని చట్టాలు చేశామన్నారు. మళ్ళీ మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నెహ్రు, ఇందిర సహా కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశంలో పేదరికం పోగొడుతామని చెప్పి చేయలేదని, మోదీ పాలనలో పేదరికం తగ్గి దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని, ప్రపంచంలో భారత్ స్థాయి పెరిగిందన్నారు.