Site icon vidhaatha

మాస్కులు లేని వారిని అనుమతిస్తే రూ.20వేల వరకు జరిమానా!

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సింఘాల్‌ వెల్లడి

విధాత,వెలగపూడి :కార్యాలయాలు,సంస్థలు,వ్యాపార సముదాయాలు,దుకాణాల్లోకి మాస్కులు లేని వారిని అనుమతిస్తే రూ.10వేల నుంచి రూ.20వేల వరకు జరిమానా విధిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు.ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. జరిమానా మొత్తాన్ని అక్కడి పరిస్థితుల ఆధారంగా ఖరారు చేస్తారని తెలిపారు.అలాగే రెండుమూడు రోజులపాటు సంబంధిత సంస్థను మూసివేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి తమకు ఆ ఫొటోలు పంపితే నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా వాట్సప్‌ నెంబరును ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో నిత్యం రాత్రి 10 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 21వ తేదీ వరకు కర్ఫ్యూ ఉంటుందన్నారు.మాస్కులు ధరించని వారి నుంచి రూ.100 జరిమానా విధించే అధికారాన్ని ఎస్‌ఐలు సహా ఆపై పోలీసు అధికారులకు అప్పగిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.ఇప్పటివరకు ఈ అధికారం వైద్యాధికారులకు మాత్రమే ఉంది.

Exit mobile version