విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. గురువారం న్యూఢిల్లీలో నీతి అయోగ్ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిసి హైదరాబాద్ మెట్రో ఫేజ్‌–2 విస్తరణతో పాటు మూసీ ప్రక్షాళన సహా పలు అభివృద్ది ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదనలను అందించారు.

తెలంగాణ సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకునేలా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.రాష్ట్ర భవిష్యత్తు అవసరాలకు గోదావరి జలాల వినియోగం అత్యంత ముఖ్యమని చెప్పారు. మెట్రో ఫేజ్‌–2లో 7 కారిడార్లలో 122.9 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు రూ.38,595 కోట్ల ప్రతిపాదనలు సమర్పించినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్‌ వెంచర్‌గా మంజూరు చేయాలని కోరారు.

హైదరాబాద్ రీజినల్‌ రింగ్‌ రోడ్డు పనులకు వెంటనే ఆమోదం తెలపాలని రేవంత్ రెడ్డి కోరారు. ఉత్తర భాగంలో భూసేకరణ ఖర్చులో 50 శాతం వాటా భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిందని గుర్తుచేస్తూ, ఎన్‌హెచ్‌ఏఐకి రూ. 626 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. ఉత్తర భాగానికి సంబంధించి 90 శాతానికి పైగా భూసేకరణ అవార్డు పూర్తయిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం నిర్మాణం కూడా తెలంగాణ రాష్ట్రానికి అంతే కీలకమని వివరించారు. చౌటుప్పల్‌ నుంచి సంగారెడ్డి వరకు దక్షిణ కారిడార్‌ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్‌ చుట్టూ రవాణా వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని తెలిపారు. దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్‌మెంట్‌ మ్యాపులు, హెచ్ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌ నోటిఫికేషన్లను ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా శాఖకు అందించామని, ఉత్తర, దక్షిణ కారిడార్లను ఒకేసారి ఆమోదించి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

“హైదరాబాద్‌ – అమరావతి – బందర్‌ పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌వేకు కేంద్రం అనుమతి ఇవ్వాలి. హైదరాబాద్‌ నుంచి అమరావతి మీదుగా బందర్‌ పోర్టును కలిపే 12 లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే తెలంగాణకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందని రేవంత్ రెడ్డి ప్రధానికి వివరించారు. 120 మీటర్ల రైట్‌ ఆఫ్‌ వే తో ప్రతిపాదించిన ఈ హైవే ద్వారా సముద్ర తీరం లేని తెలంగాణకు పోర్ట్‌ కనెక్టివిటీ లభిస్తుంది. ఫార్మా, ఎలక్ట్రానిక్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల ఎగుమతులకు ఇది కీలక మార్గంగా నిలుస్తుంది” అని వివరించారు.

వరంగల్ ఎయిర్‌పోర్ట్‌ పనులను ప్రారంభించాలన్న అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రధానంగా ప్రస్తావించారు. “వరంగల్ విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ ఇప్పటికే పూర్తిచేసి ఎయిర్ పోర్ట్ అథారిటీకి అప్పగించాం. వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌ అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ పారిశ్రామిక, విద్యా, పర్యాటక రంగాలకు మరింత ప్రయోజనం చేకూరుతుంది” అని చెప్పారు.

హైదరాబాద్‌లో IIM ఏర్పాటు చేయాలని కోరారు. “ఐఐఎంకు అవసరమయ్యే 200 ఎకరాల స్థలం కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణలో ఇప్పటికే ఐఐటీ, ఐఐఐటీ, నల్సార్‌, టీఐఎఫ్‌ఆర్‌ వంటి ప్రముఖ జాతీయ విద్యాసంస్థలున్నాయి. ఐఐఎం ఏర్పాటు చేస్తే నూతన విద్యావిధానం-2020 ఆశించిన లక్ష్యం కూడా నెరవేరుతుంది” అని ప్రధానమంత్రి మోదీకి రేవంత్ రెడ్డి వివరించారు.

కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పనులు, మూసి నది సుందరీకరణ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రితో సీఎం చర్చలు జరిపారు.