రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. రాజ్యసభ సభ్యులుగా టీడీపీకి చెందిన భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్, జనసేనకు చెందిన లింగమనేని రమేష్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాలకు జూన్ 1న భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. దీని ప్రకారం జూన్ 18న మెుత్తం 27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. జూన్, జులైలో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. అలాగే పదవీకాలం ముగియకుండానే ఖాళీ అయిన మరో మూడు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు జూన్ 1 నుంచి 8వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఈసీ తెలిపింది. ఈనెల 9న నామినేషన్ల పరిశీలన.. 11వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది.
నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిపోవడంతో ఏకగ్రీవ ఎన్నికల స్థానాలను ఈసీ ప్రకటించింది. పోటీ జరుగుతున్న రాజ్యసభ స్థానాలకు జూన్ 18న పోలింగ్ నిర్వహించి..అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. జూన్ 20 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఈసీ వెల్లడించింది.