విధాత: ఏపీ రాజధాని అమరావతిలోని వెలగపూడిలో సీఎం చంద్రబాబు సొంతింటి నిర్మాణాకి బుధవారం శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్లు పూజా కార్యక్రమం నిర్వహించారు. వెలగపూడి సచివాలయం వెనక ఈ9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. స్థలంలో నైరుతి మూలన శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
గతేడాది డిసెంబరులో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలోని నివాస ప్లాట్ను అదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబసభ్యులు కొనుగోలు చేశారు. ఇటీవలే ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తైంది. ఈ స్థలంలో ఇంటిని 1, 455 చ.గజాల విస్తీర్ణంలో జీ ప్లస్ వన్ మోడల్లో నిర్మించనున్నారు. ఏడాదిలోపే నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇంటి నిర్మాణ ప్లాన్ను లోకేశ్ కుటుంబసభ్యులకు వివరించారు. స్థలంలో ఎక్కువ భాగం పచ్చదనం, మొక్కల కోసం కేటాయించారు.
నిర్మాణ బాధ్యతను ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించారు. తాత్కాలిక హైకోర్టు, సచివాలయం మధ్యన ఉన్న ఈ స్థలానికి నాలుగు వైపులా రోడ్లు ఉండడం విశేషం. తూర్పున ఎన్10 రోడ్డు, ఉత్తరం వైపు ఈ6 రహదారులు ఉన్నాయి. ఈ స్థలం సమీపంలో నుంచే సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా వెళ్లనుంది. రాజధాని అమరావతిలోని నిర్మించే పలు కీలక భవనాలు, సముదాయలకు ఈ స్థలం నుంచి రెండు కి.మీల పరిధిలో ఉండనున్నాయి.
పశ్చిమం, దక్షిణాన లేఅవుట్లోని అంతర్గత రోడ్లు వెళ్తాయి. దీని పక్కనే ఉన్న వెయ్యి చదరపు గజాల ప్లాట్ను మల్కాపురం గ్రామానికి చెందిన రైతు నుంచి కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈశాన్యంలో ఉండడంతో వాస్తుకోసం దీనిని తీసుకున్నట్లు సమాచారం. దీన్ని సెక్యూరిటీ పోస్టు, సందర్శకుల వాహనాలు నిలిపేందుకు వినియోగించనున్నారు. చంద్రబాబు సొంతింటి నిర్మాణ భూమిపూజ వేడుక తిలకించేందుకు పెద్దఎత్తున వచ్చిన రాజధాని రైతులు కార్యక్రమం ముగిసిన వెంటనే జై చంద్రబాబు, జై అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.