18నుంచి అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈనెల 18నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల నిర్వహణకు సంబంధించి గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు

- నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ గవర్నర్
- వైసీపీ ఎమ్మెల్యేలు ఈసారైనా వస్తారా?
అమరావతి : ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈనెల 18నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల నిర్వహణకు సంబంధించి గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 18న ఉదయం 9 గంటలకు శాసనసభ ప్రారంభం కానుండగా అదే రోజు ఉదయం 10 గంటలకు శాసనమండలి ప్రారంభం కానుంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది ఉభయ సభలు వేర్వేరుగా బీఏసీ సమావేశాలలో నిర్ణయించనున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల సిద్దం..సిద్ధం అనే వైసీపీ నేతలకు దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి రాష్ట్ర అభివృద్దిలో..విధ్వంసంలో ఏవరి ప్రమేయం ఎంతో చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. దీనికి వైసీపీ నేతలు తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటూ మెలిక పెట్టారు. తగినన్ని ఎమ్మెల్యే స్థానాలు లేకుండా ప్రతిపక్ష హోదా అడగడం ఏంటని చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు ఈ దఫా కూడా హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు.