ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీల సమ్మెపై ప్రభుత్వం అల్టిమేటమ్ జారీ చేసింది. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది
– తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీల సమ్మెపై ప్రభుత్వం అల్టిమేటమ్ జారీ చేసింది. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చింది. ఈ క్రమంలో గత 20 రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని అంగన్వాడీ కేంద్రాలు మూతబడ్డాయి. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఆందోళన బాటపట్టారు. దీంతో అంగన్వాడీ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాలు, పౌష్టికాహారం నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే 20 రోజులకుపైగా రాష్ట్రంలో సాగుతున్న సమ్మెపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
అంగన్వాడీలకు అల్టిమేటం జారీ చేస్తూ, తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విధుల్లో చేరకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. విధులకు హాజరుకాని అంగన్వాడీ టీచర్లు, ఆయాలపై నిఘా పెట్టింది. అలాంటి వారి వివరాలు ఎప్పటికప్పుడు పంపించాలని కిందిస్థాయి అధికారులకు సూచనలు చేసింది. దీంతో సమ్మెపై అంగన్వాడీలు ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. దీంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది… అంగన్వాడీల ఆందోళన ఏ స్థాయికి చేరుతుందో అన్న చర్చ జరుగుతోంది.