ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అధికార, ప్రతిపక్ష వైసీపీ టీడీపీ వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలతో నెలకొన్న ఉద్రిక్తతలు మూడవ రోజు బుధవారం కూడా కొనసాగాయి
పల్నాడులో ముగ్గురు ఎమ్మెల్యేల హౌస్ అరెస్టు
తాడిపత్రి నుంచి ప్రభాకర్రెడ్డి, పెద్దారెడ్డిల తరలింపు
నానిపై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం
విధాత: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అధికార, ప్రతిపక్ష వైసీపీ టీడీపీ వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలతో నెలకొన్న ఉద్రిక్తతలు మూడవ రోజు బుధవారం కూడా కొనసాగాయి. పల్నాడు, మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి, తిరుపతి, రెంటచింతల, నర్సారావుపేటలలో మాచర్లలో 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు. కారంపూడి, కొత్తగణేషునిపాడులో హింసాత్మక ఘటనలు జరిగినందున అదనపు బలగాలను మోహరించారు.
మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాలపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మొత్తం 19 కంపెనీల బలగాలను మోహరించారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపారి మాచర్లలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాదవ్ కూడా అక్కడే ఉన్నారు. మాచర్లలో అడుగడుగునా పోలీసులు మోహరించారు. పట్టణంలోకి వచ్చేవారి వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
జిల్లాలో వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. గురజాలలో కాసు మహేశ్రెడ్డి, నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పల్నాడు అంతటా 144 సెక్షన్ అమలులో ఉన్నందున ముగ్గురి కంటే ఎక్కువమంది గుమిగూడవద్దని ఎస్పీ బిందుమాధవ్ హెచ్చరించారు. సామాన్యుల జీవనానికి ఆటంకాలు కలిగించబోమన్నారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. సత్తనపల్లిలోనూ 144సెక్షన్ విధించారు. మచిలీపట్నం బలరాంపేటలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తగా బీరు సీసాలు, కర్రలు రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఎన్నికల్లో జరిగిన ఘర్షణలకు ప్రతీకారంగా ఈ దాడులు జరిగాయి. బలరాంపేటలో పోలీస్ టికెట్ ఏర్పాటు చేశారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు అల్లరిమూకలపై లాఠీచార్జి చేశారు. గత రెండు రోజులుగా జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసాల వద్ద ఉన్న కార్యకర్తలను పోలీసులు లాఠీఛార్జి చేసి అదుపులోకి తీసుకున్నారు. లారీఛార్జిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యాలయంలో పనిచేసే దివ్యాంగుడు కిరణ్కుమార్కు, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
గొడవలు నివారించేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డిని వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. ఇరు పార్టీల కార్యకర్తలు తాడిపత్రి పట్టణంలోకి రాకుండా పోలీసులు దారులన్నీ మూసివేశారు. 144 సెక్షన్ విధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆరుగురు అనుమానితులను రామచంద్రాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని తిరుపతికి తరలించి రహస్యంగా విచారిస్తున్నారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న జడ్పీటీసీ సభ్యురాలి భర్త భానుప్రకాశ్రెడ్డి, నడవలూరు సర్పంచ్ గణపతిరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నానిపై దాడిలో సుమారు 15 మంది పాల్గొన్నట్లు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. నిందితుల అరెస్టులో జాప్యం పట్ల టీడీపీ శ్రేణులు, పులివర్తి నాని భార్య సుధ ఆందోళనకు దిగారు. 24 గంటలు గడుస్తున్నా నిందితులను పట్టుకోలేదంటూ తిరువారు పీఎస్ వద్ద నిరసన చేపట్టారు.
మరో వైపు భూమా అఖిలప్రియ గన్మెన్ నిఖిల్పై హత్యాయత్నం కలకలం రేపింది. అతడిని ముందుగా కారుతో గుద్ది ఆపైన మరణాయుధాలతో దాడి చేయగా వారి నుంచి తప్పించుకుని అఖిలప్రియ ఇంట్లోకి వెళ్లాడు. దాడి టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల పనేనని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు.
మరోవైపు ఏపీ ఎన్నికల రోజు, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై వైసీపీ నాయకుల బృందం గురువారం డీజీపీని కలిసి ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా కొందరు పోలీసు అధికారులు టీడీపీతో కుమ్మక్కయ్యారని వారిపై చర్యలు తీసుకోవాలంటూ మంత్రి అంబటి రాంబాబు, నాయకులు పేర్ని నాని, మెరుగు నాగార్జున తదితరులు డీజీపీకి వినతి పత్రం అందజేశారు.