Cyclone Alert In Andhra Pradesh | ఏపీకి తుపాన్ ముప్పు..వాతావారణ శాఖ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌ పై తుపాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది.

Cyclone Alert In Andhra Pradesh

అమరావతి : ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు పొంచి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ హెచ్చరించారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని.. ఆదివారం నాటికి తీవ్రవాయుగుండంగా రూపంతరం చెందుతుందని పేర్కొన్నారు. ఇది సోమవారం ఉదయానికి నైరుతి, దానికి ప్రక్కనే ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో వారం రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని, ఆదివారం నాడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. సోమవారం నాటికి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.