అమరావతి : హైదరాబాద్లో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ సరికాదని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎక్కడైనా సభలు నిర్వహించుకోవచ్చన్నారు. తానూ తమిళనాడుకి వెళ్లి ప్రచారం చేశానని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ల సమయం గడిచిపోయింది. ప్రజలకు ఎవరు మంచి చేశారనేది అందరికీ తెలుసు. ప్రజలకు మంచి చేయడంలో నాయకులు పోటీ పడాలి గానీ, ప్రజల మధ్య విభేదాలు తెచ్చేందుకు పోటీపడకూడదు. అభివృద్ధిని లాజికల్గా తీసుకెళ్లాలి. అనవసరంగా వివాదాలు సృష్టించడం ఎవరికీ మంచిది కాదు అని హితవు పలికారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఆరోపణలపై సీఎం స్పందిస్తూ.. డీఎస్సీపై విషప్రచారంతో యువతలో గందరగోళం సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. బ్రిడ్జ్ స్పోర్ట్స్పై అవగాహన లేకుండా గొడ్డలిపార్టీ నేతలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నోరు, పేపర్, పేటీఎం బ్యాచ్ ఉన్నాయని.. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రజలు వైసీపీ గుర్తింపును రద్దు చేసే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం సంజీవని ప్రాజెక్ట్ తెచ్చామని, సంజీవని ప్రాజెక్ట్తో ఇంటి దగ్గరే 42 రకాల వైద్య సేవలు అందిస్తాం అని తెలిపారు. యూనివర్సల్ హెల్త్ కూడా తీసుకొచ్చాం అని, యూనివర్సల్ హెల్త్, NTR వైద్య సేవ, సీఎం రిలీఫ్ అందుతాయి అని చంద్రబాబు తెలిపారు.