ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు..పదవుల పంపకాలపై ఆసక్తి కర చర్చలు సాగుతున్నాయి.
విధాత : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు..పదవుల పంపకాలపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. అన్న నాగేంద్రబాబుకు ఎంపీ సీటు ఇవ్వనందునా ఆయనకు టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కట్టబెట్టి టీటీడీని ప్రక్షాళన చేయాలని పవన్ భావిస్తున్నట్లుగా జనసేన వర్గాల కథనం. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వామ్యం, కీలక మంత్రి పదవులు సాధనపై పవన్ కల్యాణ్ దృష్టి పెట్టారని ప్రచారం సాగుతుంది.
కేంద్ర మంత్రి పదవులతో పాటు రాష్ట్రంలో డిప్యూటీ సీఎం, రాష్ట్రంలో కీలక శాఖలు, రాజ్యసభ స్థానాలు, నామినేటెడ్ పోస్టులపై కూడా పవన్ గురి పెట్టారని తెలుస్తుంది. మరోవైపు విజయవాడ కనకదుర్గ గుడి చైర్మన్ పోస్టుకు జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ రేసులో ఉన్నారని, తమను గెలిపించిన శంకర్ పేరును సుజన, చిన్నిలు సిఫారసు చేయనున్నారన్న టాక్ వినిపిస్తుంది. దశాబ్దకాలంగా జనసేనను నమ్ముకున్న వారందరికీ… న్యాయం చేసే దిశగా నామినేటెడ్, స్థానిక సంస్థల్లోనూ తగిన ప్రాధాన్యతనిచ్చేందుకు కసరత్తు జరుగుతుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.