తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు మే 23వ తేదీ వరకు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది
విధాత: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు మే 23వ తేదీ వరకు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నెల 22న నైరుతీ బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని, అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని, కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించిందని, సముద్రమట్టానికి 3.1 కి.మీ. ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది.
తమిళనాడులోని ఉత్తర ప్రాంతాల వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించిందని, ఈ నెల 23వ తేదీ వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కోంది. దక్షిణ అండమాన్ సముద్రంలో నైరుతీ రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, రేపటికి బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతాలపై నైరుతీ రుతుపవనాలు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
అంతేగాక రాగల ఐదు రోజుల వరకు రాయలసీమ, కోస్తాంధ్రాలో వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కానీ తొలి రెండు రోజులు అంటే ఇవాళ, రేపు మాత్రం భారీగా వర్షం పడుతుందని అంచనా వేసింది. కాగా గడిచిన 24 గంటల నుంచి కోస్తాంధ్రా, రాయలసీమలో చెదురుమొదురు వర్షాలు పడుతున్నాయి.