తొట్లకొండ బౌద్ధక్షేత్రం భూమిలో యథాతథ స్థితి..
విధాత: విశాఖ జిల్లా కాపులుప్పాడ శివారు గ్రామం మంగమారిపేటలోని సర్వే నంబరు 314లో ఉన్న బౌద్ధక్షేత్రం భూమి విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది.1978లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఈ మేరకు చర్యలు తీసుకోవాలంది.వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విశాఖ జిల్లా కలెక్టర్, పురావస్తుశాఖ డైరెక్టర్, విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసింది. […]

విధాత: విశాఖ జిల్లా కాపులుప్పాడ శివారు గ్రామం మంగమారిపేటలోని సర్వే నంబరు 314లో ఉన్న బౌద్ధక్షేత్రం భూమి విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది.
1978లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఈ మేరకు చర్యలు తీసుకోవాలంది.
వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విశాఖ జిల్లా కలెక్టర్, పురావస్తుశాఖ డైరెక్టర్, విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసింది. విచారణను ఐదు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
కాపులుప్పాడ సమీపంలోని సాంస్కృతిక వారసత్వ సంపద తొట్లకొండ బౌద్ధక్షేత్రానికి చెందిన భూమిని కేవలం 120 ఎకరాలుగా ప్రకటిస్తూ ఈ ఏడాది జులై 31న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 131 జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ కె.వెంకటరమణరావు అనే వ్యక్తి హైకోర్టులో పిల్ వేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది గంటా రామారావు వాదనలు వినిపిస్తూ.. 3 వేల ఎకరాలకు పైగా భూమిని తొట్లకొండ బౌద్ధక్షేత్రానికి చెందినదిగా ప్రకటిస్తూ 1978 మే 2న ప్రభుత్వం జీవో 627 జారీ చేసిందన్నారు. తాజా జీవోలో ఆ భూమిని 120 ఎకరాలకు కుదించారన్నారు.
ఎలాంటి అధ్యయనం చేయకుండా, వేల ఎకరాలున్న బౌద్ధక్షేత్రం భూమిని 120 ఎకరాలకే పరిమితం చేయడం సరికాదన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. 1978లో ఇచ్చిన జీవో ప్రకారం బౌద్ధక్షేత్రం భూమి విషయంలో యథాతథ స్థితి పాటించాలని అధికారులను ఆదేశించింది.