సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరియర్ని ఎంత చక్కగా ప్లాన్ చేసుకుంటున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవైపు సినిమాలు, మరోవైపు బిజినెస్లు చేసుకుంటూ తన జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు మాదిరిగా ఉండేలా చేసుకున్నాడు. ఆయన కొన్నేళ్ల క్రితం థియేటర్ బిజినెస్లోకి కూడా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఏషియన్ సినిమాకి చెందిన సునీల్ నారంగ్ మరియు భరత్ నారంగ్ల సహ యాజమాన్యంలో గచ్చిబౌలిలో ఏఎంబీ సినిమాస్ని లాంచ్ చేశారు. ఈ థియేటర్ సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంది. పలు సినిమా ఫంక్షన్స్ కూడా ఈ థియేటర్లో జరిపించారంటే దీని ప్రత్యేకత ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
అయితే రీసెంట్గా ఏఎంబి సినిమాస్ ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ ఐదేళ్ల వేడుకలకు నమ్రతా శిరోద్కర్, గౌతమ్ ఘట్టమనేని స్పెషల్ గెస్ట్లుగా హాజరయ్యారు. వీరితో పాటు సునీల్ నారంగ్, భరత్ నారంగ్, జాన్వీ నారంగ్ కూడా హాజరయ్యారు. ఐదేళ్ల వేడుక సందర్భంగా ఏఎంబీ సిబ్బందికి గౌతమ్ ఘట్టమనేని బహుమతులు అందజేశారు. ఏఎంబీ సినిమాస్ గుంటూరు కారం మెనూ మరియు ప్రత్యేక వార్షికోత్సవ కాంబోలను పరిచయం చేస్తూ… 5 సంవత్సరాల ప్రత్యేక లోగోను విడుదల చేశారు. అలాగే సినీ ప్రియులకు కొన్ని బహుమతులు కూడా అందించారు.
అత్యాధునిక హంగులతో ఏఎంబీ మల్టీప్లెక్స్ రూపొందిచగా, ఇందులో సినిమాని బెస్ట్ ఎక్స్పీరియన్స్ తో వీక్షింవచ్చు. అందుకే సినీ ప్రియులు అక్కడికి పోటెత్తుతుంటారు.ప్రస్తుతం ఏఎంబీ ఐదేళ్ల సక్సెస్ సెలబ్రేషన్స్కి సంబంధించిన పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.ఇక మహేష్ బాబు విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన గుంటూరు కారం చిత్రంతో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండగా, సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. ఈ మూవీ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్తో ఓ విజువల్ వండర్ మూవీని చేయబోతున్నాడు. ఈ సినిమాతో మహేష్కి పాన్ ఇండియా స్టార్డం కూడా దక్కనుందని అంటున్నారు.