పొత్తు విషయంలో సానుకూలత వ్యక్తమౌతున్నా.. బీజేపీని కలుపుకొంటామనడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
(విధాత ప్రత్యేకం)
టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కలిసి ప్రకటించారు. టీడీపీ 94 స్థానాల్లో, జనసేన 24 చోట్ల పోటీ చేస్తుందన్నారు. 3 లోక్సభ సీట్లు కూడా జనసేనకు కేటాయించారు. ఈ సందర్భంగా బాబు, పవన్ మాట్లాడుతూ.. ఈ కూటమికి బీజేపీ ఆశిస్సులున్నాయని, ఆ పార్టీ కలిసి వస్తే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. బీజేపీతో పొత్తును దృష్టిలో పెట్టుకుని తమ సీట్ల సంఖ్యను కుదించుకున్నామని, పరిమిత స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించామని పవన్ తెలిపారు. అయితే ఈ కూటమి పొత్తు విషయంలో సానుకూలత వ్యక్తమౌతున్నా.. బీజేపీని కలుపుకొంటామనడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ, జనసేనతో పాటు సీపీఐ, సీపీఎం గట్టిగా పోరాడుతున్నాయి. రాజధాని విషయంలో టీడీపీ పోరాటానికి వామపక్షాలు మద్దతునిచ్చాయి. ఆ పార్టీతో కలిసి పనిచేశాయి. కానీ ఆ పార్టీలను కాదని బీజేపీని కలుపుకోవాలని అనుకోవడం ఆత్మహత్యా సదృశమే అంటున్నారు. ఎందుకంటే వామపక్షాలతో పోలిస్తే బీజేపీ బలం అంతంత మాత్రమే. అలాంటి పార్టీకి ప్రాధాన్యం ఇవ్వడం అర్ధరహిత ఆలోచనగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
బీజేపీని కలుపుకొంటే వైసీపీకే మేలు
బీజేపీ కలిసి వస్తుందని పవన్ అంటే ఆ పార్టీ వస్తే మంచిదే అంటున్న బాబు వ్యాఖ్యలు చర్ఛనీయాంశమయ్యాయి. ఎందుకంటే ఈ కూటమి ఆహ్వానంపై ఇప్పటివరకు బీజేపీ స్పందించలేదు. ఆ పార్టీ కలిసి వస్తుందా లేదా అన్నది సస్పెన్సే. ఎందుకంటే బీజేపీకి రాష్ట్రంలో ఎంపీ సీట్లు కావాలి. ఆ పార్టీకి సొంతంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా లేవు. కనుక కేంద్రంలో తమకు మద్దతు ఇచ్చే వారికే ఆ పార్టీ పరోక్షంగా సహకరిస్తుంది. అందుకే బీజేపీ రాష్ట్ర నాయకత్వం జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పటికీ కేంద్ర నాయకత్వం మాత్రం వైసీపీతో అవగాహనతోనే ఉన్నది. దీనికి కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వైసీపీ ఎలాంటి షరతులు లేకుండా పార్లమెంటులో అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చింది. రాష్ట్రానికి వచ్చినప్పుడు కేంద్ర మంత్రులు, ప్రధాని జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసినా, ఆ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని వారి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినా అవన్నీ మాటల వరకే పరిమితమయ్యాయి. పవన్ కల్యాణ్ చెబుతున్న ప్రకారం బీజేపీ కూటమితో కలిసి వస్తే ఆ పార్టీకి పదిలోపు సీట్లు ఇచ్చే అవకాశాలున్నాయి. అయితే దీనివల్ల వైసీపీకి 20 సీట్లు వస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
టీడీపీ ఒంటరిగా వెళ్లినా మెజారిటీ మార్క్ దాటొచ్చు
మరో ముఖ్యవిషయం ఏమిటంటే టీడీపీ తొలి జాబితాలో 94 మంది అభ్యర్థులను ప్రకటించింది. కానీ జనసేన తనకు ఇచ్చిన 24 స్థానాల్లో 5గురు అభ్యర్థులను మాత్రమే ప్రకటించడం, అదీ పవన్ కల్యాణ్ పార్టీ లెటర్ ప్యాడ్ లేదా ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఒక పేపర్పై రాసి మీడియా ముందు చూపెట్టడం రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. పవన్ పార్టీ ప్రభావం ఎంత? అసలు పార్టీకి అభ్యర్థులున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీలో టికెట్లు దక్కని వాళ్లు టీడీపీ వైపు వెళ్తున్నారు. కొంతమంది కాంగ్రెస్లో చేరుతున్నారు. ఇంకా ఎవరైనా తమ పార్టీ వైపు రాకపోతారా? అన్నట్టు పవన్ వ్యవహారం ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీని గద్దె దించాలన్న లక్ష్యంతో చంద్రబాబు జనసేనను కలుపుకొని వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ బీజేపీ పవన్ను ముందుపెట్టి బాబుకు చెక్ పెడుతున్నట్టు అర్థమౌతున్నది. దీనికి బదులు టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా అధికారానికి అవసరమైన సీట్లు వస్తాయంటున్నారు.
కొత్త చిక్కులు కోరితెచ్చుకుంటున్న చంద్రబాబు
వామపక్షాలు జాతీయస్థాయిలో ఇండియా కూటమిలోనే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్తో కలిసి బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి, అంతిమంగా అది జగన్కు లబ్ధి జరుగుతుందంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మొన్నటిదాకా రాజధాని, పోలవరం, ఏపీకి స్పెషల్ స్టేటల్ అంశాలు మరుగున పడి కూటమి కుంపట్లు అంశం తెరమీదికి రావడం టీడీపీ-జనసేన కూటమికి నష్టం చేస్తుందంటున్నారు. నలభై ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కూటమి గెలుపునకు దోహదపడకపోగా, కొత్త చిక్కులు కోరి తెచ్చుకుంటున్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇంకా ఎన్నికల షెడ్యూల్ నాటికి ఏపీలో ఎన్ని చిత్రాలు జరుగుతాయో చూడాలి!