అందాల హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటు తెలుగు, అటు హిందీ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న విషయం తెలిసిందే. 2009 కన్నడ చిత్రం గిల్లితో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కి సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తెలుగు సినిమాల్లో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అయితే 33 ఏళ్ల రకుల్ గోవాలోని ఐటీసీ గ్రాండ్లో ఫిబ్రవరి 19వ తేదీన తన ప్రియుడు జాకీ భగ్నానీని వివాహం చేసుకుంది.పంజాబీ ఆనంద్ కరాజ్, సింధి సంప్రదాయల్లో వీరిద్దరి వివాహం జరిగినట్టు తెలుస్తుండగా, ఇరు సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ వేడుకని ఘనంగా నిర్వహించారు.
ఇక పెళ్లికి ఇండస్ట్రీకి చెందిన అనేక మంది స్టార్స్ హాజరై సందడి చేశారు. సంగీత్ ఫంక్షన్లో శిల్పా శెట్టి డ్యాన్స్ హైలైట్గా నిలిచిందని తెలుస్తోంది. ఇక రుకుల్ ప్రీత్ సింగ్ – జాకీ భగ్నానీ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమై ఆ తర్వాత మూడేళ్లపాటు ప్రేమాయణం సాగించారు. తమ ప్రేమ విషయాన్ని ఎట్టకేలకి 2021 అక్టోబర్లో వారిద్దరూ ప్రకటించారు. రకుల్ పుట్టిన రోజు సందర్భంగా ఆ విషయాన్ని ప్రకటించగా, ఆ తర్వాత ఇద్దరు కలిసి సరదాగా చెట్టాపట్టాలు వేసుకుంటూ తిరిగారు. ఎట్టకేలకి ఈ ఇద్దరు పెళ్లి బంధంతో ఒక్కటి కాగా, వారి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అయితే పెళ్లి తర్వాత ఈ జంట హనీమూన్ కోసం విదేశాలకి ప్లాన్ చేసుకుందట.
కాని తాజాగా ఆ హనీమూన్ని వాయిదా వేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఈ జంట ప్రస్తుతం తమ సినిమా పనులపై దృష్టి సారిస్తున్నారని టాక్. జాకీ నిర్మించిన అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ల బడే మియాన్ చోటే మియాన్ చిత్రం రిలీజ్ అయిన తర్వాతే వారు హనీమూన్కి ప్లాన్ చేసుకుంటారట. షాహిద్ కపూర్ హీరోగా కూడా జాకీ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాకీ నిర్మిస్తున్న ఓ చిత్రంలో అక్షయ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుంది.ఈ సినిమా రిలీజ్ తర్వాత మంచి ప్లేస్ సెలక్ట్ చేసుకొని ఈ జంట హనీమూన్కి వెళ్లనుందని ఇన్సైడ్ టాక్