రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులకు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ దిశగా ఇంకా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు.
30వేల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందా?
(విధాత ప్రత్యేకం)
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక వాగ్దానాలు చేసింది. ముఖ్యంగా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చింది. ఆ దిశగా ప్రస్తుత ప్రభుత్వం ఇంకా జాబ్ క్యాలెండర్ గానీ, కార్యాచరణ గానీ ప్రకటించలేదు. తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని సీఎం రేవంత్రెడ్డి చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న నియామక పత్రాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు ఈ ప్రభుత్వ హయాంలో వచ్చినవి కాదు. ఇది నిరుద్యోగులకు కూడా తెలుసు. ఒకవేళ తాము ఇప్పటికే వివిధ దశల్లో ఉన్న ఉద్యోగ నియామక ప్రక్రియను పూర్తి చేస్తూనే.. మిగిలిన ఖాళీలతో కలిపి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. గ్రూప్-1లో అదనంగా 60 పోస్టులు కలిపారు. గత ప్రభుత్వం 5,059 పోస్టులతో జారీ చేసిన డీఎస్సీని రద్దు చేసింది. వాటికి అదనంగా 6,000 పైగా పోస్టులు కలిపి 11,062తో మెగా డీఎస్సీ పేరుతో తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది అంటే ఇదే. కానీ గత ప్రభుత్వ హయాంలో వచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు అందించి అది తమ ఘనతగా చెప్పుకోవడం హాస్యాస్పదమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హామీని నిలుపుకోని గత ప్రభుత్వం
గత ప్రభుత్వం 2022 మార్చినెలలో అసెంబ్లీ వేదికగా నిరుద్యోగులకు ఇచ్చిన 80వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన హామీని నిలబెట్టుకోలేదు. బిస్వాల్ కమిటీ రాష్ట్రంలో లక్షా 90 వేలకు పైగా ఖాళీలున్నాయని పేర్కొన్నది. ఆ ఖాళీలన్నీ భర్తీ చేయాలని నాటి విపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లలో కొన్నింటికి పరీక్షలు నిర్వహించి, ఫలితాలు విడుదల చేసినా కొన్ని సాంకేతిక కారణాల వల్ల నియామకాలు ముందుకు సాగలేదు. వాటిపై సమీక్ష చేసి, ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం గత ప్రభుత్వం చేయలేదు. దీంతో నియామక ప్రక్రియ ఆగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియామకాల భర్తీకి అడ్డంకిగా ఉన్న న్యాయపరమైన, సాంకేతికపరమైన, విధానపరమైన సమస్యలను పరిష్కరించడంతో 30 వేల మంది నిరుద్యోగులకు నియామకపత్రాలు అందాయి. అయితే వీటిని తమ ఘనతగా చెప్పుకోవడం సరికాదని బీఆరెస్ అంటున్నది. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన డీఎస్సీపై కొన్ని జిల్లాల నిరుద్యోగులు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. వీటిలో ఎక్కువ భాగం ఎస్జీటీలే ఉండటం, వాటికి బీఎడ్ చేసిన వారు అర్హులు కాకపోవడం, కొన్ని జిల్లాల్లో కొన్ని సబ్జెక్టుల్లో పోస్టులు లేకపోవడం వంటి సమస్యలున్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మరిన్ని పెంచాలనే అభిప్రాయం నిరుద్యోగ అభ్యర్థుల నుంచి వ్యక్తమౌతున్నది. రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా కొత్తగా వచ్చిన జోనల్ వ్యవస్థ ప్రకారం ఒక నిరుద్యోగ అభ్యర్థి వేరే జిల్లాకు వెళ్లి రాసుకునే అవకాశం లేదు. సెకండరీ విద్య బలోపేతం కాకుండా ప్రైమరీ స్కూళ్లు, ఉన్నత పాఠశాలలు బలోపేతం కావని 1952లో మొదలియార్ కమిషన్ స్పష్టం చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం మాట్లాడుతూ.. ప్రతి ఊరికి, తండాకు ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వం రేషనలైజేషన్ పేరుతో దాదాపు 6000 వేల పాఠశాలలను మూసి వేసిందనే విమర్శలు ఉన్నాయి. కనుక ప్రస్తుత సీఎం ఇచ్చిన హామీ మేరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను పెంచాలనే డిమాండ్ను పరిగణనలోకి తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఎందుకంటే 2017లో టీఎస్పీఎస్సీ టీఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఆరేళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్ లేదు. అలాగే గత ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంచడం వల్ల నిరుద్యోగులకు చాలా అన్యాయం జరిగింది. పదవీ విరమణ పెంపును కొంతమంది ఉద్యోగులు కూడా వ్యతిరేకించారు. కాబట్టి నిరుద్యోగులకు ఈ ప్రభుత్వంపై అనేక ఆశలున్నాయి. ఆ ఆకాంక్షల మేరకు ఎక్కువ సంఖ్యలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఉద్యోగార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.