Ratan Tata | దిగ్గజ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ గ్రహీత, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా( Ratan Tata )(86) బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యల కారణంగా ముంబై( Mumbai )లోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి( Breach Candy Hospital ) ఐసీయూలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు కన్నుమూశారు. రతన్ టాటా మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi )తో పాటు పలు పారిశ్రామికవేత్తలు, నాయకులు సంతాపం ప్రకటించారు.
రతన్ టాటా విద్యాభ్యాసం..
1937 డిసెంబర్ 28న నావల్ టాటా- సోనీ టాటా దంపతులకు రతన్ టాటా జన్మించారు. టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటాకు మునిమనుమడు రతన్ టాటా. 8వ తరగతి వరకు ఆయన ముంబైలోని కాంపియన్ స్కూల్లో చదివారు. ఆ తర్వాత కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్లో, షిమ్లాలోని బిషప్ కాటన్ పాఠశాలలోనూ తన చదువు కొనసాగించారు. 1955లో న్యూయార్క్లోని రివర్డేల్ కంట్రీ స్కూల్లో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్కర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్లో పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చేరి అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశారు.
పారిశ్రామిక ప్రస్థానం..
1962లో టాటా స్టీల్ చేరడం ద్వారా తన వృత్తి జీవితాన్ని రతన్ టాటా ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగిన రతన్ టాటా 1991లో టాటా గ్రూపు ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టి సంస్థను ఎన్నో రెట్లు అభివృద్ధి చేశారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు టాటా సన్స్ గ్రూపును ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమంగా నడిపించారు. 1996లో టెలికమ్యూనికేషన్స్ కోసం టాటా టెలిసర్వీసెస్ని స్థాపించగా, 2004లో ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)గా రూపాంతరం చెంది సాఫ్ట్ వేర్ రంగంలోనూ లక్షలాది మందికి ఉపాధి కల్పించారు. రెండు దశాబ్దాల అనంతరం 2012లో టాటా గ్రూప్ చైర్మన్ బాధ్యతల నుంచి రతన్ టాటా తప్పుకున్నారు.
సిరస్ మిస్ట్రీ 2012 నుంచి 2016 వరకు టాటా గ్రూప్ ఛైర్మన్గా కొనసాగారు. 2016 అక్టోబర్ నుంచి ఆరు నెలల పాటు టాటా గ్రూప్నకు తాత్కాలిక చైర్మన్గా రతన్ టాటా వ్యవహరించారు. 2017లో ప్రస్తుత చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ బాధ్యతలు చేపట్టారు. సామాన్య ప్రజలకు సొంత కారు కలను నెరవేర్చిన వ్యాపార చాణక్యుడు రతన్ టాటా. 2009లో నానోను (Nano Car)ను కేవలం లక్ష రూపాయల ఖర్చుతో రతన్ టాటా విడుదల చేశారు. ఇందుకోసం ఆయన తీవ్రంగానే శ్రమించారని చెప్పవచ్చు.
రతన్ టాటా అందుకున్న అవార్డులు, సత్కారాలు ఇవే..
దేశంలో మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ ను 2000లో అందుకున్నారు. భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ 2008లో ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఆయనను సత్కరించింది. మహారాష్ట్ర ప్రభుత్వం 2006లో మహారాష్ట్ర భూషణ్ బిరుదు ఇచ్చి సత్కరించింది.
2014లో హానరరీ నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటీష్ అంపైర్ పురస్కారం క్వీన్ ఎలిజబెత్ నుంచి అందుకున్నారు
2021లో అస్సాం వైభవ్తో రతన్ టాటాను సన్మానించారు
2023లో ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అందుకున్నారు
2004లో మెడల్ ఆఫ్ ద ఒరియెంటల్ రిపబ్లిక్ ఆఫ్ ఉరుగ్వే పురస్కారం
2007లో కార్నేజ్ మెడల్ ఆఫ్ ఫిలాంథ్రపీ అవార్డు
2008లో సింగపూర్ ప్రభుత్వం నుంచి హానరరీ సిటిజన్ అవార్డ్
2009లో ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి లైఫ్ టైమ్ కాంట్రిబ్యూషన్ అవార్డ్ ఫర్ ఇంజనీరింగ్ అవార్డ్
2009లో ఇటలీ నుంచి గ్రాండ్ ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ద ఇటాలియన్ రిపబ్లిక్ అని ఆ దేశ అత్యున్నత పురస్కారం
2010లో యేల్ యూనివర్సిటీ నుంచి లెజెండ్ ఇన్ లీడర్ షిప్ అవార్డ్
2012లో జపాన్ ప్రభుత్వం నుంచి గ్రాండ్ కార్డన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ పురస్కారం
రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ నుంచి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు
2016లో ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి కమాండర్ ఆఫ్ లిజియన్ ఆఫ్ ద హానర్
2023 మహారాష్ట్ర ఉద్యోగరత్న
వీటితో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ యూనివర్సిటీలు, దేశాల నుంచి గౌరవ డాక్టరేట్ను రతన్ టాటా అందుకున్నారు.