Site icon vidhaatha

Aviation: మేక్ ఇన్ ఇండియాకు తోడ్పాటు.. కేంద్ర మంత్రి సమక్షంలో భారీ ఒప్పందం

ఢిల్లీ: మహీంద్రా గ్రూప్‌నకు చెందిన మహీంద్రా ఏరోస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (MASPL) ఎయిర్‌బస్ హెలికాప్టర్స్ నుంచి H130 లైట్ సింగిల్-ఇంజిన్ హెలికాప్టర్ ప్రధాన ఫ్యూజ్‌లేజ్‌ను తయారు చేసే బాధ్యతను పొందింది. ఈ ఒప్పందం భారత్ ‘మేక్ ఇన్ ఇండియా’కు సంబంధించి ఒక ముఖ్యమైన విజయంగా నిలిచింది. ఈ సహకారం ప్రపంచ ఏరోస్పేస్ రంగంలో మహీంద్రా స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని మహీంద్రా సంస్థ తెలిపింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, మంత్రిత్వ శాఖ కార్యదర్శి వుమ్లున్‌మాంగ్ వుయల్నామ్, ఎయిర్‌బస్ ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు రెమి మెయిలార్డ్, మహీంద్రా గ్రూప్ సీఈవో అనిష్ షా సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.

ఈ ప్రాజెక్టు కింద మహీంద్రా H130 ఫ్యూజ్‌లేజ్ అసెంబ్లీలను ఉత్పత్తి చేసి, యూరప్‌లోని ఎయిర్‌బస్ కేంద్రాలకు సరఫరా చేస్తుంది. తొలి డెలివరీ మార్చి 2027 నాటికి పూర్తవుతుంది. మహీంద్రా గ్రూప్ CEO డాక్టర్ అనిష్ షా మాట్లాడుతూ.. “ఎయిర్‌బస్‌తో మా దీర్ఘకాల సంబంధాన్ని ఈ ఒప్పందం మరింత బలపరుస్తుంది. భారత ఏరోస్పేస్ పరిశ్రమను ప్రపంచ స్థాయిలో నిలపడంలో ఎయిర్‌బస్ కీలక పాత్ర పోషిస్తోంది. ‘మేక్ ఇన్ ఇండియా’ అంశంలో మా నిబద్ధతను ఈ సహకారం చాటుతుంది” అని అన్నారు.

ఎయిర్‌బస్ అధ్యక్షుడు రెమి మెయిలార్డ్ మాట్లాడుతూ.. “భారత్‌లో అసెంబ్లీ, తయారీ, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో సమగ్ర వ్యవస్థను నిర్మించేందుకు మేము కృషి చేస్తున్నాం. ఈ ఒప్పందం భారత సరఫరా గొలుసు శ్రేష్ఠతపై మా నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది” అని పేర్కొన్నారు. ఇప్పటికే ఎయిర్‌బస్ వాణిజ్య విమానాలకు మహీంద్రా.. వివిధ భాగాలను సరఫరా చేస్తోంది. భారత్ నుంచి ఎయిర్‌బస్ ఏటా 1.4 బిలియన్ డాలర్ల విలువైన భాగాలను సేకరిస్తోంది. H130 హెలికాప్టర్ ప్రయాణీకుల రవాణా, పర్యాటకం, వైద్య సేవలు వంటి అనేక రంగాల్లో ఉపయోగపడుతోంది.

Exit mobile version