PM Modi Says It Is Best Time To Invest | భారత్ లో పెట్టుబడులకు ఇదే బెస్ట్ టైమ్ : ప్రధాని మోదీ
భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే అత్యుత్తమ సమయమని ప్రధాని మోదీ అన్నారు. డిజిటల్ రంగంలో ఇండియా వేగంగా దూసుకుపోతోందని, 5జీ మార్కెట్లో రెండో స్థానంలో ఉందని తెలిపారు.

న్యూఢిల్లీ : భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే ఉత్తమ సమయం అని ప్రధాని మోదీ అన్నారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారతీయ ప్రజాస్వామ్య విధానం ఈజ్ ఆఫ్ బిజినెస్కు అనుకూలంగా ఉందన్నారు. తమ ప్రభుత్వ పాలసీలతో దేశం ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రాంతంగా మారిందన్నారు. మేకిన్ ఇండియాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. పెట్టుబడులకు, ఆవిష్కరణలకు, మేకిన్ ఇండియాకు ఇదే ఉత్తమ సమయం అన్నారు. సంస్కరణల వేగాన్ని మరింత విస్తరిస్తున్నామని మోదీ తెలిపారు. సెమీకండక్టర్లు, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో తయారీలకు భారత్ ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పరిశ్రమలు, ఆవిష్కర్తలు, స్టార్టప్లు ఇప్పుడు మరింత దూసుకెళ్లాలన్నారు.
డిజిటల్ రంగంలో గణనీయ పురోగతి
డిజిటల్ రంగంలో గత దశాబ్ధ కాలంలో ఇండియా వేగంగా ముందుకెళ్లిందన్నారు. భారత్లో 1జీబీ డేటా .. ఒక కప్పు ఛాయ్ ధర కన్నా తక్కువే అని తెలిపారు. మొబైల్స్, సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ , ఇన్వెస్ట్మెట్ అవకాశాలకు ఇదే అత్యుత్తమ సమయం అని మోదీ తెలిపారు. డిజిటల్ కనెక్టివిటీ ఇప్పుడో ప్రత్యేక హక్కు లేదా లగ్జరీ కాదు అని ఇది ప్రతి భారతీయుడి జీవితంలో అంతర్భాగమైందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద టెలికం మార్కెట్లో ఇండియా రెండో స్థానంలో ఉందన్నారు. 5జీ మార్కెట్లోనూ రెండో స్థానంలో ఉన్నామన్నారు. దేశంలో ఒకప్పుడు 2జీ సేవలు సరిగా అందలేదని, కానీ ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయని మోదీ తెలిపారు.