Mhow Rape victim । ఇద్దరు ఆర్మీ అధికారుల(Army officers)పై దాడి చేసి, వారి స్నేహితురాళ్లలో ఒకరిపై లైంగికదాడి చేసిన దుండగులు.. బుధవారం తెల్లవారుజామున మోటర్ సైకిళ్లపై తిరుగుతూ తాము దోపిడీ చేసేందుకు ఎవరు దొరుకుతారోనని వెతుకుతున్నారని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు ఇండియన్ ఎక్స్ప్రెస్కు తెలిపారు. బాధితులపై దాడి చేయడమే కాకుండా పది లక్షలు ఇవ్వాలని బెదిరించారని పేర్కొన్నారు. ఈ ఘటనపై స్టేట్మెంట్ ఇచ్చేందుకు బాధితురాలు నిరాకరిస్తుండటం తమకు క్లిష్టంగా (conundrum) పరిణమించిందని పోలీసులు చెబుతున్నారు. బాధితుల్లో ఒకరైన ఆర్మీ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. ‘ఆ మహిళతో వారు చెడుగా ప్రవర్తించారు. ఆమెకు ఏదో జరగరానిది జరిగిందని నేను అనుమానిస్తున్నాను’ అని ఎఫ్ఐఆర్లో ఆర్మీ అధికారి తెలిపారు. ‘నిందితులను కాల్చి చంపండి.. లేదా నన్ను కాల్చి చంపండి అన్న ఒక్క మాటే ఆమె మాకు చెబుతున్నది. ఆమె షాక్లో ఉన్నట్టు మాకు అర్థమైంది. ఈ పని చేసినవారిని అరెస్టు చేసేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం’ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసేందుకు ఆయన ఎన్ని సార్లు ప్రయత్నించినా ఆమె నోరు మెదపడం లేదు. ‘ఆమె స్టేట్మెంట్ ఇచ్చే స్థితిలో లేరు. ఆమె కోలుకునేంత వరకూ మేం ఎదురు చూస్తాం. అనిల్ పవన్, రితేశ్ అనే ముగ్గురు వ్యక్తులను మేం అరెస్టు చేశాం. రితేశ్ 2019లో ఒక హత్య కేసులో బయటకు వచ్చాడు. మిగిలిన ముగ్గురిని కూడా అరెస్టు చేస్తాం’ అని ఇండోర్ రూరల్ ఎస్పీ హితికా వాసల్ ది ఇండియన్ ఎక్స్ప్రెస్కు చెప్పారు.
ఎఫ్ఐఆర్ ఏమంటున్నది?
ఇద్దరు యువ ఆర్మీ అధికారులు తమ ఇద్దరు స్నేహితరాళ్లతో కలిసి జామ్ గేట్ (Jam Gate) సమీపంలోని ఆర్మీ ఫైరింగ్ రేంజ్ వద్దకు రాత్రి 11 గంటల సమయంలో వెళ్లారని ఎఫ్ఐఆర్ పేర్కొంటున్నది. వాహనం నుంచి బయటకు వచ్చి, ఏకాంత ప్రదేశంలో కూర్చొని ఉండగా.. తెల్లవారుజాము 2.30 గంటల సమయంలో ఏడెనిమిది మంది వ్యక్తులు కర్రలు, రాడ్లతో మాపై దాడి చేశారు. ఏం కావాలని అడిగితే పది లక్షలు కావాలని లేదంటే చంపేస్తామని బెదిరించారు. ఒకడి చేతిలో పిస్టల్ ఉన్నది. వచ్చినవాళ్లు 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కుల్లా కనిపించారు’ అని ఎఫ్ఐఆర్లో ఆర్మీ అధికారి తెలిపారు. అరెస్టయిన ముగ్గురిపైనా గతంలో పలు కేసులు ఉన్నాయని పోలీసు రికార్డులు పేర్కొంటున్నాయి.
ఈ ఘటన నేపథ్యంలో శాంతి భద్రత(law and order)లకు సంబంధించి అధికార బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు అనేవే లేవని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. రోజు రోజుకూ మహిళల పట్ల పెరుగుతున్న నేరాల పట్ల బీజేపీ ప్రభుత్వ ఉదాశీనత ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు. పాలకుల వైఫల్యం వల్లే ఇటువంటి నేరాలు పెచ్చరిల్లుతున్నాయని, దేశంలో అభద్రతా వాతావరణం నెలకొన్నదని ఆయన విమర్శించారు. వీటి మూలానే మన దేశ ఆడబిడ్డల ఆకాంక్షలపైన, స్వేచ్ఛపైనా నియంత్రణలు ఉన్నాయని అన్నారు.
ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాత్రం.. తమ కఠిన చర్యల వల్లే ముగ్గురు నిందితులను పట్టుకోగలిగామని, మిగిలినవారిని కూడా పట్టుకుంటామని చెబుతున్నారు. ఇటువంటి విషయాల్లో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అంటున్నారు.