భార్య ఉరేసుకున్న సంఘటనలో భర్తను కొట్టిచంపిన దారుణం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో జరిగింది
అచ్చంపేటలో ఘటన
విధాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: భార్య ఉరేసుకున్న సంఘటనలో భర్తను కొట్టిచంపిన దారుణం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలివి. అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం చిన్నంపల్లికి చెందిన సింధు (25), అచ్చంపేట శ్రీరామ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన నాగార్జున (30) మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అచ్చంపేటలో నివాసం ఉంటుండగా, కాపురం సజావుగా సాగింది. శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన సింధు ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన నాగార్జున వెంటనే స్పందించి, బాధితురాలిని తాను పనిచేస్తున్న ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా మారడంతో అదే రాత్రి నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో రంగారెడ్డి జిల్లా అమనగల్ వద్ద సింధు మృతి చెందింది. సింధు మృతికి భర్త నాగార్జున కారణం అంటూ మృతదేహం ఉన్న వాహనంలోనే కుటుంబ సభ్యులు గొడవపడ్డారు. గొడవ త్రీవం కావడంతో కొందరు కుటుంబ సభ్యులు నాగార్జునపై దాడి చేసి దారుణంగా చితకబాదారు. దెబ్బలకు తట్టుకోలేని నాగార్జున అక్కడికక్కడే వాహనంలోనే చనిపోయాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.