Site icon vidhaatha

గ‌ణేశుడికి గ‌రిక అంటే ఎందుకంత ఇష్టం..? ఆ వేడి త‌గ్గించినందుకేనా..?

కొత్త‌గా ఏ ప‌ని ప్రారంభించినా మొద‌ట వినాయ‌కుడికే పూజ‌లు చేస్తుంటారు. విఘ్నేశ్వ‌రుడు పూజ‌లు అందుకున్న త‌ర్వాతనే మిగ‌తా ప‌నులు ప్రారంభిస్తారు. ఇక ప్ర‌తి బుధ‌వారం కూడా వినాయ‌కుడికి భ‌క్తులు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తుంటారు. గ‌ణ‌నాథుడికి ఇష్ట‌మైన గ‌రిక‌ను స‌మ‌ర్పించి, మొక్కులు తీర్చుకుంటారు. మ‌రి గ‌ణేశుడికి గ‌రిక అంటే ఎందుకంత ఇష్టం. ఆ గ‌రిక వెనుకాల ఉన్న క‌థేంటో తెలుసుకుందాం..

పురాణాల ప్ర‌కారం.. అనలాసురుడు అనే రాక్షసుడు నిప్పును పుట్టించి లోకాన్నంత దహించసాగాడట. అయితే దేవతలంతా వినాయకుడి దగ్గరకు వచ్చి తమను రాక్షసుడు వేడిని పుట్టించి ఇబ్బందుల పాలు చేస్తున్నాడని, తమను ఎలాగైన కాపాడాలని గ‌ణ‌నాథుడిని వేడుకోగా, వినాయకుడు తమ శరీరాన్ని పెంచేసి ఆ రాక్షసుడిని మింగేశాడ‌ట‌. ఆ త‌ర్వాత విఘ్నేశ్వ‌రుడి శ‌రీరంలో వేడి మొదలైంద‌ట‌. చంద్రుడు వచ్చి మంటను తగ్గిస్తానంటూ వినాయకుని తలపై నిలబడ్డాడ‌ట‌. అయినా కూడా వేడి తగ్గలేద‌ట‌. విష్ణువు తన కమలాన్ని వినాయకుడికి ఇస్తాడ‌ట‌. పరమశివుడు తన మెడలోని పామును గణేశుని బొజ్జ చుట్టూ చుడతాడ‌ట‌. ఎన్ని పరిచర్యలు చేసినా గణపతి శరీరంలో మంటలు తగ్గలేద‌ట‌. చివరకు కొంతమంది ఋషులు వచ్చి 21 గరిక పోచలు ఘనాపాటి సమర్పిస్తే గణపతి శరీరంలో వేడి తగ్గుతుందని చెప్పడం వల్ల 21 గరిక పోచలు గణేశుని తలపై ఉంచగానే వినాయకుని శరీరంలో మంటలు తగ్గి ఉపశమనం కలిగింద‌ని పురాణాలు చెబుతున్నాయి.

అప్పుడు వినాయకుడు ఇలా అన్నాడట‌. ఎవరైతే తనకు గరికతో పూజిస్తారో వారికి ఎల్లప్పుడు తన ఆశీర్వాదాలుంటాయని, కష్టనష్టాలు తీరుస్తానని చెప్పడంతో అప్పటి నుంచి వినాయకుడికి గరికతో పూజించడం ఆనవాయితీగా వస్తోంది. అంతే కాదు ఏ పని అయినా ఆరంభించేటప్పుడు, శుభకార్యాల సమయంలో గణపతిని గరికతో ఆరాధిస్తే చేసే పనుల్లో విఘ్నాలు ఉండవని కూడా గణపతి వరమిస్తాడు.

Exit mobile version