TTD | తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్. జూలై మాసానికి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఇవాళ ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనున్నది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్లో టికెట్లు కేటాయించనున్నది. ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటాను 22న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయబోతున్నది. 22న వర్చువల్ సేవల కోటా విడుదలవనున్నది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూలై నెల కోటాను 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నది.
జూలై నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూలై నెల ఆన్ లైన్ కోటాను 23న ఉదయం 11 గంటలకు అందుబాటులో ఉండనున్నాయి. ఇక వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూలై నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నది.
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో వసతి గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నది. ఏప్రిల్ 27న శ్రీవారి సేవ ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు వివరించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లను బుక్ చేసుకోవాలని కోరింది.