Banking Course | జీవితంలో బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే వారి కోసం 'పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (PGDBT)' కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన వెలువడింది. హైదరాబాద్లోని 'ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రిసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (IDRBT)' 2024 సంవత్సరానికి ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ కోర్సులో చేరినవారు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు అవసరమైన సాంకేతిక అంశాలపై శిక్షణ పొందవచ్చు. కోర్సు చివరలో క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తారు.
Banking Course : జీవితంలో బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే వారి కోసం ‘పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (PGDBT)’ కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన వెలువడింది. హైదరాబాద్లోని ‘ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రిసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (IDRBT)’ 2024 సంవత్సరానికి ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ కోర్సులో చేరినవారు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు అవసరమైన సాంకేతిక అంశాలపై శిక్షణ పొందవచ్చు. కోర్సు చివరలో క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తారు.
ఈ ఆధునిక యుగంలో అన్ని రంగాలు సాంకేతికత ఆధారంగానే నడుస్తున్నాయి. సేవా రంగమైన బ్యాంకింగ్పై సాంకేతికత ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలను సమర్థంగా నిర్వహించడంలో టెక్నాలజీ అవసరాన్ని ఆర్బీఐ గుర్తించింది. అందుకోసం 1996లో హైదరాబాద్లో మసాబ్ ట్యాంకు ఎన్ఎండీసీ సమీపంలో IDRBT ని నెలకొల్పింది. ఈ సంస్థ భారతీయ బ్యాంకులు, ఆర్థిక విభాగాలకు అవసరమైన టెక్నాలజీని అందిస్తుంది. ఆ రంగాలకు అవసరమైన సాంకేతిక అంశాలపై పరిశోధనలు చేస్తుంది.
వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి, బ్యాంకులకు నిర్వహణ ఖర్చులు తగ్గించడానికి, బ్యాంకులు లాభదాయకంగా మారడానికి టెక్నాలజీ, మేనేజ్మెంట్ విభాగాల్లో సమర్థ మానవవనరులు అవసరం. ఆ దిశగా ఆవిర్భవించిందే పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ కోర్సు. ఈ కోర్సును 2016 నుంచి అందిస్తున్నారు. ప్రస్తుతం 2024 బ్యాచ్లో ప్రవేశాలకు IDRBT ప్రకటన విడుదల చేసింది. తాజా ప్రకటన ద్వారా ప్రవేశాలు పొందిన వారికి జూలై 1 నుంచి నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఈ కోర్సులో మొత్తం 40 సీట్లు ఉంటాయి. అందులో 10 స్పాన్సర్డ్ సీట్లు. వాటిని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కేటాయించారు.
అర్హత : కనీసం 60 శాతం మార్కులతో బీటెక్ లేదా ఏదైనా సబ్జెక్టులో ఫస్ట్ క్లాస్తో డిగ్రీని 10+2+4 విధానంలో చదివి ఉండాలి. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్, క్యాట్, జీమ్యాట్, జీఆర్ఈ, సీమ్యాట్, గ్జాట్, మ్యాట్, ఆత్మా.. మొదలైన వాటిలో ఏదో ఒక స్కోరు తప్పనిసరిగా అవసరం.
ఎంపిక విధానం : వచ్చిన దరఖాస్తులను స్కోర్ ఆధారంగా షార్ట్లిస్ట్ చేస్తారు. అనంతరం గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించి వాటిలో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు వ్యవధి : ఈ కోర్సును ఫుల్టైం విధానంలో ఏడాది వ్యవధితో అందిస్తున్నారు. ఇందులో సాంకేతిక వినియోగం, సమన్వయం, నిర్వహణల గురించి నేర్పిస్తారు. మారుతున్న సాంకేతికతను బ్యాంకింగ్ రంగానికి ఎలా అనువర్తించాలో విద్యార్థులు నేర్చుకుంటారు. వీరికి ఆధునిక సాంకేతిక అంశాల్లో శిక్షణ అందించి టెక్నో నిపుణులుగా తయారుచేస్తారు.
ఈ కోర్సు మొత్తం 4 టర్మ్లలో ఉంటుంది. వసతితో కలిపి కోర్సు ఫీజు రూ.5 లక్షల వరకు అవుతుంది. బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కూడా పొందవచ్చు. ఈ కోర్సులో లెక్చర్లు, సెమినార్లతోపాటు ఐటీ నిపుణులతో ఇంటరాక్టివ్ సెషన్లు ఉంటాయి. సీనియర్ బ్యాంకర్లతోపాటు సంస్థకు చెందిన రిసెర్చ్ సెంటర్లు ఇందులో భాగమవుతాయి. క్రిప్టోగ్రఫీ, డేటాబేస్ మేనేజ్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఐవోటీ, బిగ్డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, మొబైల్ బ్యాంకింగ్, పేమెంట్ సిస్టమ్ మొదలైన అంశాల్లో శిక్షణ ఇస్తారు. చివరి టర్మ్లో ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. ఫ్యాకల్టీ సభ్యుల పర్యవేక్షణలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో ఈ ప్రాజెక్టు వర్క్ను పూర్తిచేయాలి.
స్టైఫండ్ : ప్రతిభ చూపిన విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్ సమయంలో స్టైఫండ్ కూడా పొందవచ్చు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసిన వారికి పీజీ డిప్లొమా ప్రధానం చేస్తారు.
క్యాంపస్ ప్లేస్మెంట్స్ : ఈ కోర్సు పూర్తిచేసిన వారికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ లభిస్తాయి. హెచ్డీఎఫ్సీ, బంధన్, ఐడీబీఐ, కరూర్ వైశ్య, ఫెడరల్, కోటక్, సౌత్ ఇండియా, ఎన్పీసీఐ తదితర సంస్థల్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ను సొంతం చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
చివరి తేదీ : 2024 ఏప్రిల్ 30
వెబ్సైట్ : www.idrbt.ac.in/pgdbt