Bandla Ganesh | టాలీవుడ్లో బండ్ల గణేష్ పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చేది ఆయన ముక్కుసూటి స్వభావమే. జూనియర్ ఆర్టిస్టుగా సినీ ప్రయాణం మొదలుపెట్టి, నిర్మాతగా–వ్యాపారవేత్తగా ఎదిగిన ఆయన కెరీర్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఏ విషయమైనా నేరుగా చెప్పే ధైర్యం, వెనుకా ముందూ ఆలోచించకుండా తన అభిప్రాయాన్ని వెల్లడించే స్టైల్ వల్ల బండ్ల గణేష్ ప్రసంగాలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇటీవల నిర్మాత అల్లు అరవింద్పై చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద చర్చకు దారి తీశాయి. నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని స్పష్టంగా చెప్పడం ఆయన ప్రత్యేకతగా మారింది.
అయితే ఈ ముక్కుసూటితనానికి మరో కోణం కూడా ఉంది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై ఆయనకు ఉన్న అభిమానభావం. పవన్ను కేవలం హీరోగా కాకుండా ఒక దేవుడిలా భావిస్తానని బండ్ల గణేష్ పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. “ఈశ్వరా… పవనేశ్వరా” అంటూ ఆయన చేసే వ్యాఖ్యలు మెగా అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తుంటాయి. ఎవరు ఎంత ప్రలోభపెట్టినా పవన్పై తన అభిప్రాయం మారదని ఆయన ఎన్నో సందర్భాల్లో స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ చెప్పిన అనుభవం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి తనను పిలిచి ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేశాడని, అయితే దానికి ప్రతిరోజూ ప్రెస్మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ను విమర్శించాలనే షరతు పెట్టారని వెల్లడించారు.
ఆ ఆఫర్ను తాను ఖండిస్తూ… “నా శరీరం బూడిద అయినా, ఆ బూడిద కూడా పవన్ కళ్యాణ్ను తిట్టదు” అంటూ అక్కడినుంచి బయటకు వచ్చేశానని చెప్పారు. ఈ వ్యాఖ్యలు మెగా అభిమానుల్లో మరింత ఆదరణ పొందగా, ఆ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. అయితే ఆ ఆఫర్ ఇచ్చింది ఏ పార్టీ నాయకుడో మాత్రం ఆయన వెల్లడించలేదు. పవన్ కళ్యాణ్పై తన అభిమానాన్ని బండ్ల గణేష్ గతంలోనూ పలు సందర్భాల్లో చాటుకున్నారు. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్బస్టర్ సినిమాను నిర్మించి పవన్తో ప్రత్యేక అనుబంధం ఏర్పరుచుకున్నారు. ఏ సందర్భం వచ్చినా ఆయనపై తన గౌరవాన్ని, అభిమానాన్ని వ్యక్తపరచడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయరు.
ఇక మరోవైపు బండ్ల గణేష్ ప్రస్తుతం భక్తి ప్రయాణంతో కూడా వార్తల్లో నిలుస్తున్నారు. వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన సమయంలో ఆయన క్షేమంగా బయటకు రావాలని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని మొక్కుకున్నట్లు తెలిపారు. ఆ మొక్కును తీర్చుకునేందుకు ఇటీవల షాద్నగర్ నుంచి తిరుమల వరకు పాదయాత్ర ప్రారంభించి, భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు రోజులు సాగిన ఈ యాత్ర ఆయన విశ్వాసానికి నిదర్శనమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
